Virat Kohli: దిష్టి తగిలింది.. ఏంటి కోహ్లి ఇలాంటివి కూడా నమ్ముతాడా?.. పోస్టు వైరల్‌!

17 Nov, 2021 16:28 IST|Sakshi

Virat Kohli in latest Social Media post Goes Viral: కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ మొదలు టీ20 ప్రపంచకప్‌ వరకు సుదీర్ఘ కాలంపాటు బయో బబుల్‌లో గడిపారు చాలా మంది క్రికెటర్లు. ఇక టీమిండియా ఆటగాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస సిరీస్‌లు, ఐపీఎల్‌ రెండు అంచెలు, పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌ టోర్నీ.. ఇలా బిజీబిజీగా గడిపారు. ఈ నేపథ్యంలో బయో బబుల్‌లో జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అన్న అంశంపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటికే పలుమార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో.. వరల్డ్‌కప్‌ టోర్నీ తర్వాత వెంటనే న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌ ఉన్నప్పటికీ కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలని భావించింది బీసీసీఐ. కోహ్లితో పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు కూడా ఇప్పుడు రెస్ట్‌ మూడ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ ఫొటోకు యాడ్‌ చేసిన ఎమోజీ చర్చనీయాంశమైంది. విమానంలో కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్న ఫొటోలు పంచుకున్న కోహ్లి.. కనుగుడ్డును పోలిన ఎమోజీ జత చేయడం విశేషం. దీంతో.. కోహ్లి పోస్టు వెనుక అర్థం ఏమిటా అని నెటిజన్లు గూగుల్‌లో తెగ వెదికేస్తున్నారు.

దిష్టి తగిలింది..!
టర్కీ సంప్రదాయంలో.. దిష్టి తగలకుండా.. చెడు దృష్టి, దుష్టశక్తి నీడ మన మీద పడకుండా ఉండేందుకు కనుగుడ్డు ఆకారంలో ఉండే ఆభరణాన్ని ధరిస్తారట. మెడలో వేసుకునే గొలుసుకు లాకెట్‌గా లేదంటే బ్రాస్‌లెట్‌కు దీన్ని జతచేసి వేసుకుంటారట. అయితే ప్రాక్టికల్‌గా కనిపించే కోహ్లి... ఇలా ఈ ఆభరణాన్ని ప్రతిబింబించే ఎమోజీ జతచేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోహ్లి ఇలాంటివి నమ్ముతాడా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 

ఇక టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న కోహ్లి ఆశ నెరవేరలేదన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌తో ఘోర పరాజయాల నేపథ్యంలో టీమిండియా కనీసం సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించింది. దీంతో కోహ్లి కెప్టెన్సీపై పలువురు విశ్లేషకులు పెదవి విరిచారు కూడా. ఈ నేపథ్యంలోనే తనకు దిష్టి తగిలిందన్ననందు వల్లే ఇలా జరిగిందని.. అందుకే దాని నుంచి తనను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కోహ్లి ఈ ఎమోజీని షేర్‌ చేశాడని తమకు తోచినట్లుగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న సిరీస్‌ బుధవారం(నవంబరు 17) నుంచి ఆరంభం కానుంది.

చదవండి: Venkatesh Iyer: టీమిండియాకు ఆడటం ముఖ్యం కాదు.. అదే నా కల.. నాకంటే తను సెలక్ట్‌ కావడమే ఎంతో సంతోషం!
Ind Vs Nz 2021: ‘బ్యాటర్‌’గా విరాట్‌ కోహ్లి... టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే!

Poll
Loading...
మరిన్ని వార్తలు