-

'నో చాన్స్.. బుమ్రా ఆ అవకాశం ఇవ్వడు'‌

24 Mar, 2021 11:15 IST|Sakshi

పుణే‌: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం టీమిండియా సెలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ను తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో తుది జట్టులో యజ్వేంద్ర చహల్‌కు చోటు దక్కకపోవడంపై వీరు అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ విజయం అనంతరం సెహ్వాగ్‌ మీడియాతో మాట్లాడాడు.

''జట్టు మేనేజ్‌మెంట్‌ తుది జట్టు ఎంపిక ప్రక్రియలో బౌలర్ల, బ్యాట్స్‌మెన్ల మధ్య పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. ఇందుకు ఉదాహరణ.. కేఎల్‌ రాహుల్‌‌, చహల్‌. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో చహల్‌ నిరాశపరిచే ప్రదర్శనను కనబరచడంతో మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యాడు. అదే సమయంలో రాహుల్‌ తాను ఆడిన నాలుగు టీ20ల్లోనూ ఘోరంగా విఫలమైన వన్డే జట్టులోకి తీసుకున్నారు.

రాహుల్‌ ప్రదర్శనను తప్పుబట్టాలని నా ఉద్దేశం కాదు. అతను మొదటి వన్డేలో చాలా బాగా ఆడాడు. ఒక బ్యాట్స్‌మన్‌కు ఇచ్చిన అవకాశం బౌలర్‌కు కూడా ఇవ్వాలనేదే నా అభిప్రాయం. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా బౌలర్‌కు పక్కనబెట్టకుండా అతనికి అవకాశాలు ఇవ్వాలి. చహల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకోవడం వరకు బాగానే ఉన్నా.. అతను వికెట్లు తీయకపోగా.. పరుగులు దారాళంగా ఇచ్చుకున్నాడు. అని చెప్పుకొచ్చాడు. అయితే బుమ్రా విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా అని ఒకరు ప్రశ్నించగా.. లేదు బుమ్రా ఆ చాన్స్‌ ఇవ్వడు.. అతను మంచి బౌలర్‌.. మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చే అవకాశం ఉంది'' అని తెలిపాడు.

కాగా మిడిలార్డర్‌లో వచ్చిన కేఎల్‌ రాహుల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కాగా మ్యాచ్‌ విషయానికి వస్తే భారత్‌ 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా... కేఎల్‌ రాహుల్‌ (43 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కృనాల్‌ పాండ్యా (31 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (60 బంతుల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్‌ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (66 బంతుల్లో 94; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా, జేసన్‌ రాయ్‌ (35 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ప్రసిధ్‌ కృష్ణకు 4, శార్దుల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది.  
చదవండి:
వైరల్‌: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్‌ రనౌట్‌‌‌‌‌
థర్డ్‌ అంపైర్‌ కళ్లకు గంతలు.. సెహ్వాగ్‌ ఫన్నీ ట్రోల్‌

మరిన్ని వార్తలు