IND VS AUS 1st T20: టీ20ల్లో అత్యుత్తమ ఛేజింగ్‌.. రోహిత్‌ను దాటేసిన సూర్యకుమార్‌

24 Nov, 2023 13:36 IST|Sakshi

ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్‌ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓ అత్యుత్తమ రికార్డు సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో ఆసీస్‌పై విజయం సాధించిన భారత్‌.. పొట్టి ఫార్మాట్‌లో తమ అత్యుత్తమ రన్‌ ఛేజింగ్‌ రికార్డును మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌.. ఆసీస్‌ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. ఈ మ్యాచ్‌కు ముందు టీ20ల్లో భారత్‌ అత్యుత్తమ ఛేజింగ్‌ రికార్డు 208 పరుగులుగా ఉండింది.

హైదరాబాద్‌ వేదికగా 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 208 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. టీ20ల్లో భారత్‌ అన్ని దేశాల కంటే అధికంగా ఐదు సార్లు 200 ప్లస్‌ స్కోర్లను ఛేదించింది. భారత్‌ పొట్టి ఫార్మాట్‌లో 209, 208, 207, 204, 202 పరుగులకు విజయవంతంగా ఛేదించింది. భారత్‌ తర్వాత సౌతాఫ్రికా (4), పాకిస్తాన్‌ (3), ఆస్ట్రేలియా (3) అత్యధికంగా 200 ప్లస్‌ స్కోర్లను ఛేదించాయి. 

రోహిత్‌ను దాటేసిన సూర్యకుమార్‌..
భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో తొలి టీ20లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న స్కై.. తన 54 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో 13 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (115 మ్యాచ్‌ల్లో 15) టాప్‌లో ఉండగా.. రోహిత్‌ శర్మ (148 మ్యాచ్‌ల్లో 12) మూడో స్థానంలో నిలిచాడు. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. జోష్‌ ఇంగ్లిస్‌ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్‌ (14 బంతుల్లో 22 నాటౌట్‌; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు