World Cup 2023: దక్షిణాఫ్రికా చేతిలో కివీస్‌ ఘోర ​ఓటమి.. సెమీస్‌ రేసులోకి పాకిస్తాన్‌

1 Nov, 2023 21:58 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ప్రోటీస్‌ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది. ఇక న్యూజిలాండ్‌ ఘోర ఓటమితో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కివీస్‌ నాలుగో స్ధానానికి చేరుకోగా.. ఆస్ట్రేలియా మూడో స్ధానానికి ఎగబాకింది. కివీస్‌ ఓటమితో  పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత రెట్టింపు అయ్యాయి. 

పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరాలంటే?
ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్‌ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంకా పాకిస్తాన్‌కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్లతో పాకిస్తాన్‌ తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌పై కచ్చితంగా విజయం సాధించాలి. 

అప్పుడు పాక్‌ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. అయితే  ఈ 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీస్ చేరడం చాలా కష్టం. ఈ సమయంలో ఇతర జట్ల ఫలితాలపై పాక్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 8 పాయింట్లతో నాలుగో స్ధానంలో కివీస్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. మరోవైపు ఆరో స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్‌ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచులు గెలవకూడదు.

అప్పుడు ఈ కివీస్‌, అఫ్గాన్‌ రెండు జట్లు 8 పాయింట్లతో ఉంటే.. పాక్ 10 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఒక వేళ  కివీస్‌ ఒక్క మ్యాచ్‌, అఫ్గానిస్తాన్‌ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అప్పుడు మూడు జట్లు 10 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ క్రమంలో రన్‌రేట్‌ పరంగా మూడింటిలో ఒక జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

కాగా పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్ధానంలో ఆస్ట్రేలియా సెమీస్‌కు ఈజీగా చేరే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే ఆసీస్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన చాలు. ఎందుకంటే మెరుగైన రన్‌రేట్‌ ఉంది కాబట్టి సెమీస్‌కు అసీస్‌ క్వాలిఫై అవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో స్ధానం కోసం తీవ్ర పోటీ నెలకొనడం ఖాయమన్పిస్తోంది.
చదవండి: World Cup 2023: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 190 పరుగుల తేడాతో భారీ విజయం

మరిన్ని వార్తలు