Rohit Sharma: వాళ్లే బెస్ట్‌.. ఇకపై నేను మీకు జవాబు ఇవ్వను: రోహిత్‌ శర్మ

5 Sep, 2023 14:40 IST|Sakshi

India's ODI World Cup 2023 Squad- Rohit Sharma Comments: ‘‘మా దృష్టి మొత్తం ట్రోఫీ గెలవడంపైనే కేంద్రీకృతమై ఉంది. ఇక నుంచైనా బయట వాగే చెత్త గురించి వరల్డ్‌కప్‌ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో నన్ను ప్రశ్నించరని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇకపై నేను అలాంటి కామెంట్లపై మీకు సమాధానం ఇచ్చే ప్రసక్తే లేదు. 

మేము ప్రొఫెషనల్స్‌. మేమేం చేయాలో నాతో పాటు మా ఆటగాళ్లకు కూడా తెలుసు’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విలేకరులకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. దయచేసి అనవసర విషయాల గురించి ప్రస్తావించవద్దని విజ్ఞప్తి చేశాడు.

అత్యుత్తమైన వాళ్లనే సెలక్ట్‌ చేసుకుంటాం
టీమిండియాకు ఆడుతున్న క్రికెటర్ల నుంచి అత్యుత్తమైన 15 మందిని మాత్రమే తాము ఎంచుకోగలమని నొక్కివక్కాణించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి బీసీసీఐ జట్టును మంగళవారం ప్రకటించింది. ఆసియా కప్‌-2023 ప్రధాన జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు తిలక్‌ వర్మ, ప్రసిద్‌ కృష్ణ మినహా మిగతా వాళ్లనే ఐసీసీ ఈవెంట్‌కు సెలక్ట్‌ చేసింది.

ఈ క్రమంలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జట్టు కూర్పు గురించి మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల అభిప్రాయాలు.. జట్టుపై విమర్శల నేపథ్యంలో విలేకరుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందుకు స్పందించిన రోహిత్‌ ఈ మేరకు కాస్త గట్టిగానే బదులిచ్చాడు.

ఆసీస్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌
అదే విధంగా జట్టు గురించి చెబుతూ... ‘‘అందుబాటులో ఉన్న వాళ్ల నుంచి అత్యుత్తమ టీమ్‌ను ఎంపిక చేసుకున్నాం. మా బ్యాటింగ్‌లో డెప్త్‌ ఉంది. మా దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారు. ఇతర బౌలింగ్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

జట్టుకు మేలు చేసే విధంగానే తమ నిర్ణయాలు ఉంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా అక్టోబరు 5న చెన్నైలో ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో ప్రపంచకప్‌-2023 టోర్నీకి తెరలేవనుంది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.

చదవండి: తిలక్‌తో పాటు అతడికి నో ఛాన్స్‌! ఇదే ఫైనల్‌.. మార్పుల్లేవు: అజిత్‌ అగార్కర్‌
కండలు పెంచితే సరిపోదు.. కాస్తైనా: టీమిండియా స్టార్లపై మాజీ బ్యాటర్‌ ఘాటు విమర్శలు

మరిన్ని వార్తలు