పరాజయంతో మొదలుపెట్టిన భారత్‌.. ఆరు అవకాశాలు లభించినా..!

14 Jan, 2024 11:02 IST|Sakshi

రాంచీ: మహిళల హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీని భారత జట్టు ఓటమితో మొదలు పెట్టింది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ 0–1 తేడాతో అమెరికా చేతిలో పరాజయంపాలైంది. అమెరికా తరఫున 16వ నిమిషంలో తామెర్‌ అబిగైల్‌ ఏకైక గోల్‌ నమోదు చేసింది. తొలి క్వార్టర్‌ హోరాహోరీ సాగి ఒక్క గోల్‌ కూడా నమోదు కాకపోగా, రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే యూఎస్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆ తర్వాత భారత మహిళలు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్కోరును సమం చేయలేకపోయారు. దురదృష్టవశాత్తూ ఆరు పెనాల్టీ అవకాశాలు వచ్చినా... ఒక్కదానిని కూడా గోల్‌గా మలచలేక భారత్‌ వృథా చేసుకుంది. నేడు జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది. 

>
మరిన్ని వార్తలు