భారత మహిళల ఓటమి 

2 Dec, 2023 00:35 IST|Sakshi

సాంటియాగో (చిలీ): హాకీ మహిళల జూనియర్‌ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్‌కు తర్వాతి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. టోర్నీ రెండో పోరులో జర్మనీ 4–3 గోల్స్‌ తేడాతో భారత మహిళల జట్టును ఓడించింది. భారత్‌ తరఫున అన్ను (11వ నిమిషం), రోప్నీ కుమారి (14వ ని.), ముంతాజ్‌ ఖాన్‌ (24వ ని.) గోల్స్‌ కొట్టగా...జర్మనీ తరఫున లౌరా ప్లూత్‌ (21వ నిమిషం, 36వ ని.), సోఫియా స్వాబ్‌ (17వ ని.), కరోలిన్‌ సీడెల్‌ (38వ ని.) గోల్స్‌ సాధించారు.

తొలి క్వార్టర్‌లోనే 2 గోల్స్‌ సాధించి ముందంజలో నిలిచిన భారత్‌ మ్యాచ్‌ అర్ధ భాగం ముగిసే సరికి కూడా 3–2తో ఆధిక్యంలోనే ఉంది. అయితే అనూహ్యంగా పుంజుకున్న జర్మనీ రెండో అర్ధభాగంలో రెండు నిమిషాల వ్యవధిలో 2 గోల్స్‌ కొట్టింది. ఆఖరి క్వార్టర్‌లో ఇరు జట్లూ పోరాడినా ఒక్క గోల్‌ నమోదు కాకపోగా, జర్మనీ తమ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంది. భారత్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడుతుంది.   

మరిన్ని వార్తలు