వన్డేల్లో బాబర్‌ ఆజమ్‌ టాప్‌ ర్యాంక్‌పై వసీం జాఫర్‌ వ్యంగ్యాస్త్రం

14 Apr, 2021 19:13 IST|Sakshi

చెన్నై: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని(857 రేటింగ్‌ పాయింట్లు) వెనక్కునెట్టి టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌కు(865) భారత మాజీ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వసీం జాఫర్‌ శుభాకాంక్షలు తెలిపారు. వన్డేల్లో బాబర్‌ టాప్‌ ప్లేస్‌కు చేరిన సందర్భంగా ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలపడంతో పాటు అతని టాప్‌ ర్యాంక్‌పై వ్యంగ్యాస్త్రం సంధించాడు. టీమిండియా కెప్టెన్‌కు ఛేజింగ్‌ అంటే ఎంత ఇష్టమో తెలుసుగా.. నీ టాప్‌ ర్యాంక్‌ను కూడా అతి త్వరలోనే సక్సెస్‌ఫుల్‌గా ఛేజ్‌ చేస్తాడన్న అర్ధం వచ్చేలా ఆయన ట్వీట్‌లో పేర్కొన్నాడు. జాఫర్‌ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉంటే ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్‌లో కోహ్లి ఏకంగా 1258 రోజులు పాటు టాప్‌ ర్యాంక్‌లో కొనసాగి చరిత్ర సృష్టించాడు. ఇటీవల కాలంలో అతనికి వన్డే క్రికెట్‌ ఆడే అవకాశం ఎక్కువగా రాకపోవడం వల్లే టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయాడు. చివరిసారిగా అతను ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆడాడు. అందులో కూడా రెండు అర్ద శతకాలతో రాణించి, టీమిండియాకు సిరీస్‌ విక్టరీని(2-1) అందించాడు.

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పాక్‌ కెప్టెన్‌.. ఆ సిరీస్‌ ద్వారా 13 పాయింట్లు దక్కించుకుని, కోహ్లిపై  8 పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు. సఫారీలతో జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 103, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులతో రాణించిన అజమ్‌.. ఆ జట్టు సిరీస్‌ విజయం(2-1) సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతను టీమిండియా కెప్టెన్‌ను ఓవర్‌టేక్‌ చేసి టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో జహీర్‌ అబ్బాస్‌, జావిద్‌ మియాందాద్‌, మహ్మద్‌ యూసఫ్‌ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్న నాలుగో పాక్‌ బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు.

మరిన్ని వార్తలు