హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు

29 Mar, 2023 00:48 IST|Sakshi

పావగడ: వైఎన్‌ హొసకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇంద్రబెట్ట గ్రామ రోడ్డు సమీపంలో ఈ నెల 13న చోటుచేసుకున్న ఓ వ్యక్తి హత్య కేసులో ఇప్పటికే ఓ నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఇద్దరిని మంగళవారం అరెస్టు చేశారు. వివరాలను వైఎన్‌ హొసకోట రూరల్‌ సీఐ కాంతరెడ్డి విలేకరులకు వెల్లడించారు. పథకం ప్రకారమే హత్యకు పాల్పడ్డారని తెలిపారు. హతుడు రామాంజి, నిందితులు కావేరి, చిట్టెమ్మ, రవి సంఘటన జరిగిన రాత్రి మహంతపురం నుంచి వైఎన్‌ హొసకోటకు చేరుకున్నారన్నారు. అక్కడ రామాంజికి పూటుగా మద్యం తాగించి బైకులో ఇంద్రబెట్టకు చేర్చారు. అనంతరం రవి వైఎన్‌ హొసకోటకు వెళ్లి కావేరి, చిట్టెమ్మను బైకులో ఇంద్రబెట్టకు తీసుకొచ్చాడు. వారి పిల్లల్ని మణి అనే మహిళ వద్ద ఉంచారు. నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి మళ్లీ రామాంజికి మద్యం తాగించారు. మత్తులో ఉన్న రామాంజి కాళ్లు, చేతుల్ని భార్య కావేరి, ఆమె చెల్లెలు చిట్టెమ్మ గట్టిగా పట్టుకోగా రవి పదునైన కత్తితో రామాంజి గొంతు కోశాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా బైకులోని పెట్రోలుతో కాల్చి వేసి నిందితులు పరారయ్యారని సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు