మదురై ఎయిర్పోర్టులో
బంగారం స్వాధీనం
తిరువొత్తియూరు: విమానంలో దుబాయ్ నుంచి మదురైకి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు రూ. 17.5 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి మదురైకి వచ్చే విమానంలో బంగారం తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు రహస్య సమాచారం అందింది. గురువారం సాయంత్రం మదురై విమానాశ్రయానికి వచ్చిన స్పైస్ జెట్ విమానంలో వచ్చిన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఓ మహిళా ప్రయాణికురాలు ధరించిన దుస్తుల్లో పేస్టు రూపంలో 300 గ్రాముల బంగారం దాచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 17,68,000 చేస్తుందని తెలిపారు. మహిళను పోలీసులు విచారణ చేస్తున్నారు.
పండుగ సీజన్లో కొత్త రికార్డు
సాక్షి,చైన్నె: పండుగ సీజన్లో హెవీ డ్యూటీ ట్రాక్టర్లతో సోనాలిక రైతులకు ప్రత్యేక ఆనందాన్ని అందించడమే కాకుండా కొత్త రికార్డును నెలకొల్పినట్లు ఇంటర్నేషనల్ ట్రాక్టర్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ తెలిపారు. వైటీడీ ఏప్రిల్–అక్టోబరు 23లో సోనాలిక సాధించిన రికార్డుల వివరాలను శుక్రవారం స్థానికంగా ఆయన ప్రకటించారు. మొత్తం మార్కెట్ వాటా 15 శాతం, ప్రముఖ ప్లేయర్లలో దేశీయ విక్రయాల వృద్ధిని నమోదు చేసినట్లు వివరించారు. పండుగ సీజన్ వేళ అక్టోబర్లో 18,002 ట్రాక్టర్ల విక్రయాలు నమోదైనట్లు ప్రకటించారు. రైతులకు తోడ్పాటును అందించడమే కాకుండా వారికి సకాలంలో అన్ని రకాల పనిముట్లను సమకూరుస్తున్నామని తెలిపారు.
దివ్యాంగ చిన్నారులతో దీపావళి సంబరాలు
కొరుక్కుపేట: తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలను ఆరంభించారు. శుక్రవారం చైన్నె మైలాపూర్లోని ఆంధ్ర మహిళా సభలో మానసిక దివ్యాంగులతో కలిసి ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవరకొండ రాజు, ట్రస్టీ యూహెచ్ఎన్ శర్మ, లక్ష్మి, వాణి దీపావళి జరుపుకున్నారు. చిన్నారులకు స్వీట్లు పంచి పెట్టారు.