సేలం: ఈరోడ్ దిండాల్ మురుగన్ ఆలయంలో తిరుకల్యాణ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మురుగన్ స్వామిని దర్శించుకున్నారు. ఈరోడ్లోని దిండాల్ కొండపై వేలాయుధ స్వామి (మురుగన్) ఆలయం ఉంది. ఈ ఆలయంలో స్కందషష్టి ఉత్సవాలు 13న గణపతి హోమంతో ప్రారంభమయ్యా యి. అనంతరం రోజూ ప్రత్యేక అభిషేకం, అలంకరణ, పూజలు నిర్వహించారు. శనివారం స్వామి వారికి పాలాభిషేకం నిర్వహించారు. సాయంత్రం సురసంహారం వేడుకగా జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారికి తిరుకల్యాణ ఉత్సవం వైభవంగా జరిగింది. ఇందులో వల్లి, దైవా నై సమేత వేలాయుధ స్వామి ఉత్సవ మూర్తులను పూలతో విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండం ప్రతిష్టించి ప్రత్యేక యాగం నిర్వహించారు. ఆ తర్వాత వేలాయుధస్వామి, వల్లి, దైవాన్నకు తిరుకల్యాణం నిర్వహించారు. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మురుగన్ను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తిరుకల్యాణ విందుగా అన్నదానం చేశారు. సాయంత్రం మేళ తాళాల నడుమ దైవానై సమేత సుబ్రమణ్య స్వామి గిరివలయం నిర్వహించారు. అదేవిధంగా చెన్నిమలై సుబ్రమణ్యస్వామి ఆలయం, ఈరోడ్ ఆరుద్ర కపాలీశ్వర దేవాలయం, మున్సిపల్ కలాని బాలమురుగన్ ఆలయం, చెన్నిమలై రోడ్డు మలేషియా మురుగన్మలై ఆలయాల్లో కల్యాణోత్సవం వేడుకగా సాగింది.