2 వేల ఏళ్ల క్రితమే ఇనుము పరిశ్రమలు.. వనపర్తి జిల్లాలో వెలుగుచూసిన ఆధారాలు

1 Jun, 2023 15:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇనుము తయారు చేసిన తర్వాత మిగిలిన వ్యర్ధమిది.. దీన్ని చిట్టెంగా పేర్కొంటారు. ఈ చిట్టెం రాళ్ల వయసు దాదాపు 2 వేల ఏళ్లు. శాతవాహనుల కాలంలోనే మన వద్ద ఇనుము పరిశ్రమ విలసిల్లిందనటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివారులో ఇలాంటి చిట్టెం నిల్వలను గుర్తించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు ఇనుము పరిశ్రమలకు నిలయంగా ఉండేదని, నాటి పరిశ్రమ తాలూకు అవశేషాలుగా ఇప్పుడు ఈ చిట్టెం రాళ్లు వెలుగుచూస్తున్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ వెల్లడించారు.

చిట్యాలలో తమ బృందం సభ్యులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్‌ శ్యాంసుందర్‌లు స్థానిక మూలోని గుట్ట సమీపంలోని తాళ్లగడ్డలో వ్యవసాయ క్షేత్రంలో చిట్టెం రాళ్లను గుర్తించినట్టు ఆయ­న పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమిని వ్యవసాయయోగ్యంగా మార్చే పను­లు చేస్తున్నప్పుడు 20 అడుగుల చుట్టు కొలతగల ఇటుకల కట్టడం ఆనవాళ్లు వెలుగుచూసినట్టు స్థానికులు పేర్కొంటున్నారు.  ఇనుము కరిగించేందుకు వాడే మూసలు, పెద్ద గొట్టాలు, భారీ గాగుల పెంకులు లభించినట్టు పేర్కొన్నారు. 

బయటపడిన భారీ ఇటుకలు 
16 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న భారీ ఇటుకలు కూడా బయటపడినట్టు వెల్లడిస్తున్నారు. ఇనుము కరిగించగా మిగిలిన బొగ్గు బూడిద కూడా వెలుగు చూస్తోందని పేర్కొంటున్నారు. యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర పరికరాలకు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇనుము పరిశ్రమలు ఉండేవనటానికి ఈ ఆధారాలు, ఇనుము దేవతగా పేర్కొనే మమ్మాయి దేవతారాధన ఆనవాళ్లు స్థానికంగా ఉన్నాయని హరగోపాల్‌ పేర్కొన్నారు. చిట్టెం పతం నుంచే చిట్యాల ఊరి పేరు వచి్చందని ఆయన వెల్లడించారు. సమీపంలోని పెద్ద మందడి, చిన్న మందడి, అమ్మాయిపల్లి, గణపురం, మానాజిపేటల్లో నాటి చారిత్రక ఆధారాలున్నాయని తెలిపారు.   

మరిన్ని వార్తలు