గతనెల 5న జాబితా ప్రకటించాక కొత్తగా చేరిన ఓటర్లు 8,70,072
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. గతనెల 5న ప్రకటించిన జాబితాతో పోలిస్తే.. ఐదో తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు కొత్తగా 8,70,072 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విడుదల చేసిన జాబితా ప్రకారం అందులో 3,26,02,799 ఓటర్లు ఉన్నారు. వయసు వారీగా కూడా ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
కొత్తగా చేరిన ఓటర్ల జాబితాను అక్టోబర్లో ప్రకటించిన ఓటర్ల జాబితాకు అనుబంధంగా జత చేయనున్నారు. 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య కోటీ 67 లక్షల 394 మంది ఉండగా, 40 ఏళ్ల పైబడిన వారు 1,58,73,405 మంది ఉన్నట్లు తేలింది. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేలా రాజకీయ పార్టీలతోపాటు ఎన్నికల సంఘం కూడా ఓటు విలువను తెలియ చెప్పేలా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.