రెండు రోజుల్లో 51 కరోనా పాజిటివ్‌ కేసులు

24 Aug, 2020 10:15 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: మండలంలో ప్రజలను కరోనా వణికిస్తోంతి. శని, ఆదివారాలు రెండు రోజులలోనే మండలంలోని వివిధ గ్రామాలలో 28 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీనిని బట్టి కోవిడ్‌–19 ఎంత వేగంగా  విస్తరిస్తున్నదో అర్థం అవుతుంది. శనివారం నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలలో కొణిజర్ల పీహెచ్‌సీ పరిధిలో 16, పెద్దగోపతి పీహెచ్‌సీ పరిధిలో అయిదు పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి, కొణిజర్లలో శనివారం మొత్తం 35 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 16 మందికి కోవిడ్‌ సోకినట్లు వైద్యాధికారి డాక్టర్‌ మోత్యా తెలిపారు. ఇందులో కొణిజర్లలో 7 కేసులు, శాంతినగర్‌ బీసీ కాలనీలో 3, రామనరసయ్యనగర్‌లో 3, మల్లుపల్లి, సింగరాయపాలెం, క్రాంతినగర్‌లో  ఒక్కో కేసు నమోదు అయినట్లు తెలిపారు.

పెద్దగోపతి పీహెచ్‌సీ పరిధిలోని 43 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 5 గురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌ తెలిపారు. అమ్మపాలెం, తనికెళ్ల, బస్వాపురం, రెడ్డిగూడెంలో ఒక్కొక్కరికీ, ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఆదివారం కొణిజర్ల పీహెచ్‌సీలో 16 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా వారిలో 7 గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కొణిజర్లలో 6, మల్లుపల్లిలో 1 పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు.. 

ఐదు పాజిటివ్‌ కేసులు 
వైరా: మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు నిత్యం పెరుగుతునే ఉన్నాయి. వైరా పీహెచ్‌సీ పరిధిలోని సోమవారం 13 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. అందులో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. మున్సిపాలిటీలోని హనుమాన్‌ బజార్‌లో 2, ఫిషన్‌కాలనీ, మెయిన్‌ రోడ్డుతో పాటు దాచాపురంలో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 
కారేపల్లి మండలంలో..

కారేపల్లి: కారేపల్లి మండలంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కారేపల్లి పీహెచ్‌సీలో శనివారం 21 మందికి కరోనా పరీక్షలు చేయగా, 10 మందికి కరోనా పాజిటివ్‌ నమోదు అయ్యాయని, ఆదివారం 40 మంది పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు వైద్యాధికారి హన్మంతరావు పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు కారేపల్లి మండలంలో 63 కరోనా కేసులు నమోదైనట్లయ్యింది. శనివారం రోజు మండలంలో గుంపెళ్లగూడెంలో ఒకటి, తొడితలగూడెంలో రెండు, బొక్కలతండాలో ఒకటి, కారేపల్లిలో రెండు, భాగ్యనగర్‌ తండాలో ఒకటి, పేరుపల్లిలో ఒకటి, కొత్త కమలాపురంలో ఒకటి, బాజుమల్లాయిగూడెంలో ఒక కేసు నమోదు కాగా, ఆదివారం కారేపల్లిలో 3, కొత్త కమలాపురంలో ఒకటి, బాజుమల్లాయిగూడెంలో నాలుగు, గాంధీనగర్‌లో ఒకటి, సూర్యతండాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు