23 మందితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం

3 Aug, 2020 01:27 IST|Sakshi

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటన 

8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  

8 మంది కార్యదర్శులు, ఇద్దరు కోశాధికారులు, ఒక ఆఫీస్‌ కార్యదర్శి నియామకం 

ముగ్గురు అధికార ప్రతినిధులు, 7 రాష్ట్ర మోర్చాల అధ్యక్షుల నియామకం

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గత మార్చిలో నియమితులైన బండి సంజయ్‌కుమార్‌ ఎట్టకేలకు తన టీంను ప్రకటించారు. రాజకీయ కదనరంగంలోకి 23 మంది కమలదళాన్ని దించారు. అధ్యక్షుడిగా నియమితులైన ఐదు నెలలకు 23 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కమిటీలో 8 మందికి ఉపాధ్యక్షులుగా, నలుగురికి ప్రధాన కార్యదర్శులుగా, 8 మందికి కార్యదర్శులుగా, ఇద్దరికి కోశాధికారులుగా, ఒకరికి కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. గత కమిటీలో ఉన్న కొంతమంది నేతలకు తాజా కమిటీలో పదోన్నతి కల్పించగా, మరికొంతమంది కొత్తవారిని కార్యవర్గంలోకి తీసుకున్నారు. అధికార ప్రతినిధులుగా పనిచేసిన పలువురికి పార్టీ కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. పలు మోర్చాలకు గతంలో ఉన్న అధ్యక్షులను కూడా మార్చారు. ఇప్పటివరకు ఆకుల విజయ మహిళామోర్చా అధ్యక్షురాలిగా ఉండగా, ఇప్పుడు ఆ బాధ్యతను కె.గీతామూర్తికి అప్పగించారు. పార్టీ రాష్ట్ర కమిటీకి ముగ్గురు అధికార ప్రతినిధులను నియమించారు. 

ప్రత్యామ్నాయశక్తిగా  తీర్చిదిద్దేందుకే : సంజయ్‌  
రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా తీర్చిదిద్దేందుకు, పటిష్ట పరిచేందుకు పార్టీని విస్తరించినట్లు బండి సంజయ్‌ తెలిపారు. కొత్తగా నియమితులైన రాష్ట్ర పదాధికారులకు, మోర్చాల అధ్యక్షులకు అభినందనలు తెలిపారు. పార్టీలో మిగిలిన వివిధ కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. 

పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించినవారు.. 
ఉపాధ్యక్షులు : డాక్టర్‌ జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, యెండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, బి.శోభారాణి.  
ప్రధాన కార్యదర్శులు : జి.ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులు(ఆర్గనైజింగ్‌ సెక్రటరీ). 
కార్యదర్శులు : రఘునందన్‌రావు, డాక్టర్‌ ప్రకాష్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌గౌడ్, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, కె.మాధవి, జి.ఉమారాణి. 
ట్రెజరర్ ‌: బండారి శాంతికుమార్, బవర్‌లాల్‌ వర్మ (జాయింట్‌ ట్రెజరర్‌) 
ఆఫీస్‌ సెక్రటరీ : డాక్టర్‌ ఉమా శంకర్‌ 
ఆయా మోర్చాల అధ్యక్షులు :  
యువ మోర్చా – ఎ.భానుప్రకాష్, మహిళామోర్చా– కె.గీతామూర్తి, కిసాన్‌మోర్చా – కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఎస్‌సీ మోర్చా – కొప్పు బాష, ఎస్టీ మోర్చా – హుస్సేన్‌ నాయక్, ఓబీసీ మోర్చా – ఆలే భాస్కర్, మైనారిటీ మోర్చా – అఫ్సర్‌ పాషా. 
అధికార ప్రతినిధులు : కృష్ణసాగర్‌రావు, పి.రజనికుమారి, ఎ.రాకేష్‌రెడ్డి.

మరిన్ని వార్తలు