రాములమ్మ ఎప్పుడైనా బీజేపీలోకి రావొచ్చు

3 Nov, 2020 14:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులు ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆ పార్టీ నాయకత్వం మీద కింది నేతలకు అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు. విజయశాంతి మంచి నాయకురాలని, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిందన్నారు. బీజేపీలో ఆమె ఎప్పుడు చేరేది తెలియదని, చేరాక విజయశాంతికి ప్రాధాన్యత ఏంటనేది అప్పడే చెబుతామని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన పలువురు నేతలు మంగళవారం బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీటీసీ, కాంగ్రెస్ నేత తోట సంధ్య బీజేపీలో చేరారు. ఎంపీటీసీతో పాటు వార్డు మెంబర్లు, టీఆర్‌ఎస్‌ నేతలకు బండి సంజయ్ పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. చదవండి: నిరూపిస్తే.. ఉరేసుకుంటా: బండి సంజయ్

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని దొండపాడుకు చెందిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి పేదలకు న్యాయం చేద్దామన్నారు. రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వ పాలన రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌లో తుకుడే గ్యాంగ్ ఉందన్న సంజయ్‌.. దుబ్బాక ఎన్నికల సందర్భంగా బీజేపీపై తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గానికి రూ. 200 కోట్లు ఇస్తామన్నారు. ఏమైందని ప్రశ్నించారు. చదవండి: ఎమ్మెల్యే క్రాంతి, మాజీ ఎమ్మెల్యేపై బీజేపీ దాడి

హుజూర్ నగర్ ప్రజలను మోసం చేసి విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని, అందుకే దుబ్బాక ప్రజలకు ముఖం చూపలేదని విమర్శించారు. అబద్ధం చెబితే మెడ మీద తలకాయ నరుక్కంటా అని చెప్పిన సీఎం కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పారో లెక్కలేదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులతో అగాధంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే. ఎందుకు నేరుగా వెళ్లి చూడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రజాస్వామ్య పద్దతిలో సమస్యలపై ఆందోళనలు చేస్తుందని స్పష్టం చేశారు. చదవండి: శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం బాధాకరం

>
మరిన్ని వార్తలు