నా భర్త లాస్ట్‌స్టేజీలో ఉన్నారు.. హోంగార్డు నాగమణి వీడియో వైరల్‌

8 Sep, 2023 08:16 IST|Sakshi

ఖలీల్‌వాడి: సీఎం సారూ.. హోంగార్డులను పర్మినెంట్‌ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ హోంగార్డు నాగమణి చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. గురువారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్‌ భార్య అనుభవిస్తున్న బాధను తాను కూడా అనుభవిస్తున్నట్లు చెప్పారు.

‘‘నా భర్త సాయికుమార్‌ లాస్ట్‌స్టేజీలో ఉన్నారని డాక్టర్లు చెప్పారు. పిల్లలను హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నాం.. చాలా ఇబ్బందులు పడుతున్నాం. నాలా చాలా మంది హోంగార్డులు తమ వ్యక్తిగత బాధలను చెప్పుకోలేక పోతున్నారు. చాలీచాలని జీతాలతో బతకలేకపోతున్నాం.

హాస్పిటల్‌ ఖర్చులు, స్కూల్‌ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం.. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నామే గాని మావి విలువ లేని బతుకులు.. సీఎం సారు హోంగార్డులను పర్మినెంట్‌ చేస్తామని గతంలో చెప్పారు అందుకే అడుగుతున్నాం..హోంగార్డు యూనియన్‌ నేతలైన ఏడుకొండలు, ప్రేమ్, రాజేందర్, ఇబ్రహీం, వెంకటేశ్, శివన్న సీఎం సార్‌కు ఈ వీడియోను చేరే వరకు పంపండి’’అని ఆ వీడియోలో కోరారు. తామూ తెలంగాణ బిడ్డలమేనని హోంగార్డులకు న్యాయం చేస్తే సీఎం కేసీఆర్‌ ఫొటో పెట్టుకొని బతుకుతామని ఆ వీడియోలో ఆమె వ్యాఖ్యానించారు.
చదవండి: హోంగార్డులూ..ఆత్మహత్యలు చేసుకోకండి

మరిన్ని వార్తలు