వానాకాలంలో సేకరణపై కేంద్రం స్పష్టత 

19 Nov, 2021 02:57 IST|Sakshi

దేశంలో నాలుగేళ్లకు సరిపడా పారాబాయిల్డ్‌ నిల్వలు

ఇప్పటినుంచి పారాబాయిల్డ్‌ బియ్యం తీసుకోం

తెలంగాణలో బాయిల్డ్‌ రైస్‌ పండించినా తినేది పచ్చి బియ్యమే

బాయిల్డ్‌ రైస్‌ తింటున్న రాష్ట్రాల్లోనూ ఆ పంట పండిస్తున్నారు 

సాక్షి, హైదరాబాద్‌/ న్యూఢిల్లీ: వరిసాగు, ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. వానాకాలం (2021–22)లో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల పచ్చి బియ్యం మాత్రమే సేకరించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటినుంచి పారాబాయిల్డ్‌ (ఉప్పుడు) బియ్యం ఎఫ్‌సీఐ సేకరించదని, కేవలం మిల్లింగ్‌ చేసిన రారైస్‌ (పచ్చి బియ్యం)ను మాత్రమే అనుమతి స్తామని పేర్కొంది.

దేశంలో పారాబాయిల్డ్‌ బియ్యం నిల్వలు మరో నాలుగేళ్లకు సరిపడా ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత ఆగస్టు 17వ తేదీన రాష్ట్ర ఆహార కార్యదర్శుల సమావేశంలోనే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ధాన్యం/ బియ్యం సేకరణపై వివరాలతో ఓ నోట్‌ విడుదల చేసింది. అయితే గత ఆగస్టు 17వ తేదీన రాష్ట్ర ఆహార కార్యదర్శుల సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

90లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచమన్నారు కానీ..
వానాకాలంలో బియ్యం సేకరణ లక్ష్యాన్ని 40 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 90 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ ద్వారా కోరినట్లు నోట్‌లో కేంద్రం పేర్కొంది. అయితే తెలంగాణలో 16.90 లక్షల హెక్టార్లలోనే పంట సాగు చేశారని, తద్వారా 54.27 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం దిగుమతి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపింది. 2016–17 నుంచి 2020–21 వానాకాలం వరకు నిర్దేశించిన పరిమాణానికన్నా అధికంగానే రా రైస్‌తో పాటు పారాబాయిల్డ్‌ రైస్‌ను కొనుగోలు చేసినట్లు వివరించింది. నోట్‌లో ఇంకా ఏముందంటే.. 

ఉప్పుడు బియ్యం ఉత్పత్తి, వినియోగంలో తేడా
‘దేశ వ్యాప్తంగా పారా బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తి, వినియోగంలో ఉన్న తేడాల నేపథ్యంలో ఉప్పుడు బియ్యం సేకరణను పరిమితం చేశాం. ఈ మేరకు తెలంగాణ నుంచి గత యాసంగి (2020–21)లో 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే సేకరించాల్సి ఉంది. మిగతాది పచ్చి బియ్యం పంపాలి. అయితే తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు యాసంగిలో అదనంగా మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు ఒప్పుకున్నాం.

అలాగే ఎఫ్‌సీఐ వద్ద అక్టోబర్‌ 11 నాటికి పారాబాయిల్డ్‌ రైస్‌ స్టాక్‌ 46.28 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా, మరో 32.73 లక్షల మెట్రిక్‌ టన్నులు రావలసి ఉంది. అంటే 79 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం ఎఫ్‌సీఐ వద్ద ఉన్నప్పటికీ, దేశంలో పారాబాయిల్డ్‌ రైస్‌ను వినియోగిస్తున్న రాష్ట్రాల ప్రజలకు అవసరమైంది ఏటా కేవలం 20 లక్షల మెట్రిక్‌ టన్నులే. అంటే ఇప్పుడున్న నిల్వలు మరో నాలుగేళ్ళ వరకు సరిపోతాయి..’ అని కేంద్రం తెలిపింది. 

ఈసారి ఆంక్షలు విధించాల్సి వచ్చింది 
‘తెలంగాణలో పారాబాయిల్డ్‌ రైస్‌ పండిం చినా, వినియోగించేది మాత్రం పచ్చి బియ్యమే. అయితే పారాబాయిల్డ్‌ రైస్‌ విని యోగించే రాష్ట్రాల్లో కూడా ఆ బియ్యాన్ని పండి స్తుండడంతో ఆ స్టాక్‌ కదలికలో వేగం లేదు. తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు గత ఖరీఫ్‌ (యాసంగి)సీజన్‌లో ముందు అనుమతి నిచ్చిన 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులకు అద నంగా మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నులు పారా బాయిల్డ్‌ బియ్యం తీసుకోవడానికి అంగీకరించాం.

కానీ ఈసారి వానాకాలం పారాబాయిల్డ్‌ రైస్‌ సేకరణపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. అలాగే అక్టోబర్‌ 4న రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలో.. ఎఫ్‌సీఐకి పారాబాయిల్డ్‌ రైస్‌ పంపిం చం, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ పరిశ్రమలకు ప్రోత్సా హకాలు ఇస్తాం, రైస్‌ మిల్లుల సామర్థ్యం పెం చుతాం,    ఎఫ్‌సీఐతో పాటు రాష్ట్రం అవస రాలు తీర్చడానికి బలవర్ధకమైన బియ్యం లభ్యతను సులభతరం చేస్తాం అని పేర్కొంది. ఇతర అంశాలతో పాటు నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించే చర్యలు తీసుకుంటాం అని తెలిపింది..’ అని వివరించింది. కాగా వానా కాలం సీఎంఆర్‌ గడువును అక్టోబర్‌ 2021 నుంచి జనవరి 2022గా నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు