త్యాగాల నుంచే గొప్ప విజయాలు

22 Oct, 2023 04:12 IST|Sakshi

పోలీసు అమరవీరుల దినోత్సవంలో డీజీపీ అంజనీకుమార్‌

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): పౌరులకు అందించే పోలీసు సేవల్లో తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. శనివారం గోషామహల్‌ స్టేడియంలో పోలీసు అమరవీరుల దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాల నుంచే గొప్ప విజయాలు లభిస్తాయని అన్నారు. దేశంలోనే ఉత్తమ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.

షీటీమ్స్, భరోసా కేంద్రాలు, పాస్‌పోర్టు క్లియరెన్స్, సీసీటీవీ ప్రాజెక్టుల నిర్వహణ వంటి విషయాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, శిశుసంక్షేమం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అలాగే దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్‌రేటు తగ్గుతూ వస్తోందని, తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

పౌర రక్షణ విధులలో అమరులైన 189 మంది పోలీసులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ‘అమరులు వారు’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఏడీజీ శ్రీనివాస్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య, అడిషనల్‌ డీజీలు సౌమ్యమిశ్రా, శివధర్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌ జైన్, మహేశ్‌ భగవత్‌లతో పాటు పలువురు సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారులు, విశ్రాంత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు