ధర్మపురి స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు పగలగొట్టిన అధికారులు

23 Apr, 2023 11:27 IST|Sakshi

సాక్షి, జగిత్యాల జిల్లా: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. హైకోర్టు ఆదేశాలతో  స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.


గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ అభ్యర్థి.. హైకోర్టును ఆశ్రయించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్‌తో నివేదిక సమర్పించాలని జగిత్యాల జిల్లా అధికారులు, నాటి జిల్లా ఎన్నికల అధికారిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కాగా, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవుల మిస్సింగ్‌తో హైడ్రామా నెలకొంది. కీస్ మిస్సింగ్‌పై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన నాచుపల్లి జేఎన్టీయూలో నాటి ఎన్నికల అధికారి శరత్,  ఆ తర్వాత విధులు నిర్వహించిన కలెక్టర్ రవినాయక్, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు, నాటి రిటర్నింగ్ ఆఫీసర్, ఇతర అధికారులను ఈసీఐ బృందం విచారించింది. ఈసీఐ నివేదిక సమర్పించడంతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నాటి అభ్యర్థుల సమక్షంలో ఆదివారం స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు.

నాటి ఎన్నికలకు సంబంధించిన కీలకమైన ప్రొసీడింగ్స్, 17ఏ, 17 సీ ఫామ్స్‌తో పాటు, ఫలితాల రోజు కౌంటింగ్ రూమ్ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను జిల్లా అధికారులు సమర్పించనున్నారు. ఏప్రిల్ 26లోపు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ధర్మపురి ఎన్నిక వివాదంపై కోర్టు తీర్పు, తదుపరి పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చదవండి: బొంగు బిర్యానీ, బకెట్‌ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్‌ ఛీ! బాత్‌రూం బిర్యానీ!

మరిన్ని వార్తలు