జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంతో పాటు పోలింగ్పై నిఘా
మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ
గచ్చిబౌలిలోని కమాండ్ కంట్రోల్ నుంచి 24 గంటలు పరిశీలన
15వేల సీసీ కెమెరాలు వీక్షిస్తూ క్షేత్రస్థాయి అప్రమత్తం చేసే సౌకర్యం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై సైబరాబాద్ పోలీసులు భారీ నిఘా వేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎన్నికలు జరుగుతున్న 150 డివిజన్లలో ప్రచారం దగ్గరి నుంచి పోలింగ్ వరకు గచ్చిబౌలిలో ఇటీవల ప్రారంభించిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్ నుంచే పరిశీలిస్తున్నారు. ఒకేసారి 15,000 సీసీటీవీ కెమెరాలు పర్యవేక్షించే సామర్థ్యమున్న ఈ సెంటర్ నుంచి ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వీడియో చూసి స్థానిక పోలీసులను అప్రమత్తం చేసే విధంగా ఇక్కడి సిబ్బంది పనిచేస్తోంది. ప్రతిరోజూ 24 గంటల పాటు మూడు షిఫ్ట్ల పద్ధతిన దాదాపు 50 మంది వరకు పనిచేస్తున్నారు. అలాగే సమస్యాతక, అతి సమస్యాతక ప్రాంతాలపై సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా వేసి క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసేలా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఇవీ అనుసంధానమైనవి..
శాంతిభద్రతలకు ఎంతో ఉపయోగం
‘దేశంలోనే మొదటిదైన ఈ సెంటర్ను రెండు అంతస్తుల్లో నిర్మించారు. రియల్ టైమ్ మానిటరింగ్, డయల్ 100కు సంబంధించి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్, హాక్ ఐ యాప్ సేవలు గ్రౌండ్ ఫ్లోర్లో, వార్రూమ్, డాటా సెంటర్ తొలి అంతస్తులో ఉంది. ఒకే సమయంలో 15 వేల సీసీటీవీ కెమెరాలు మానిటర్ చేసేలా భారీ స్క్రీన్ల సకల సౌకర్యాలు ఉన్నాయి. శాంతిభద్రతలు, ట్రాఫిక్, అత్యవసర సేవలు ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చు.ముఖ్యంగా ఇది ఫీల్డ్ ఆఫీసర్లకు ఉపయోగపడనుంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేసేందుకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడనుంది. ఎక్కడేమి జరిగినా క్షేత్రస్థాయి సిబ్బందిని నిమిషాల వ్యవధిలో అప్రమత్తం చేసే వీలుంది’ అని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు.