వినయ్‌కి అండగా ఉంటాం: మంత్రి హరీశ్‌ 

4 Mar, 2023 02:05 IST|Sakshi

‘సాక్షి’ కథనానికి స్పందన

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సైన్స్‌ఫేర్‌ ఈవెంట్‌లో కెమికల్‌ మీద పడి గాయపడిన ఆరో తరగతి విద్యార్థి వినయ్‌కి అన్ని విధాలా అండగా ఉంటామని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి టి.హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ‘అయ్యో వినయ్‌.. ఆదుకునేవారే లేరా?’శీర్షికన శుక్రవారం సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. వినయ్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెంటనే తన సిబ్బందిని పంపించారు.

ఆ తర్వాత బాలుడికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మంత్రి స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వినయ్‌ తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వినయ్‌ ఆరోగ్యం మెరుగై సాధారణ స్థితికి వచ్చే వరకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చికిత్స ముగిసే వరకు తోడుగా ఉండి, ప్రభుత్వ అంబులెన్స్‌లోనే ఇంటివరకు పంపిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫిబ్రవరి 28న జరిగిన ప్రమాదంలో వినయ్‌ గాయపడగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.   
 

మరిన్ని వార్తలు