Organ donation: తనువు చాలిస్తూ.. పలువురికి ఊపిరి పోశారు 

25 Nov, 2021 08:07 IST|Sakshi

సాక్షి, లక్డీకాపూల్‌ : 55 ఏళ్ల రైతు తాను చనిపోతూ మరి కొంత మందికి ప్రాణదాతగా నిలిచాడు. అవయవాల్ని దానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. నల్గొండ జాజిరెడ్డి గూడెంకు చెందిన రైతు సత్తయ్య(55)  ఈ నెల20న స్పృహ కోల్పోయాడు. దీంతో కుటుంబసభ్యులు మలక్‌పేట యశోద హాస్పటల్‌కు తరలించారు. బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్‌దాన్‌ ప్రతినిధులు సత్తయ్య భార్య కె. లక్ష్మమ్మను కలిసి అవగాహన కల్పించారు. దీంతో ఆమె తన భర్త అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించినట్టు జీవన్‌దాన్‌ ప్రతినిధి పవన్‌ రెడ్డి పేర్కొన్నారు.  
చదవండి: ఇదో గమ్మత్తు కథ.. సీజ్‌ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా!

96 ఏళ్ల వయసులో నేత్రదానం 
బంజారాహిల్స్‌: తాను మరణిస్తూ మరొకరికి వెలుగులు నింపాడు ఆ వృద్ధుడు. ప్రముఖ మానవతావాది గోపవరం రామసుబ్బారెడ్డి(96) ఈ నెల 23న కన్నుమూశారు. ఆయన నేత్రాలను అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం సేకరించి కంటి ఆస్పత్రికి అందజేసింది. బతికుండగానే ఆయన తన నేత్రాలను దానం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు మరణానంతరం వాటిని సంబంధిత కంటి ఆస్పత్రికి అందజేశారు. మరణం తర్వాత కూడా ఆయన తన మానవత్వాన్ని చాటుకున్న గొప్ప సంఘసేవకుడని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంజి ఈశ్వరలింగం తెలిపారు.  

మరిన్ని వార్తలు