ప్రపంచంలోకెల్లా అతిచిన్న మైక్రోస్కోప్‌

30 Jun, 2021 02:11 IST|Sakshi

అభివృద్ధి పరిచిన ఐఐటీ హైదరాబాద్‌  

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచంలోనే అతిచిన్న మైక్రోస్కోప్‌ను హైదరాబాద్‌ ఐఐటీ అభివృద్ధి చేసింది. ముస్కోప్‌గా నామకరణం చేసిన ఈ ఆవిష్కరణ ఆటోమెటిక్‌గా పనిచేస్తుందని, దీన్ని ఎక్కడికైనా సులువుగా తరలించవచ్చని ఐఐటీ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. దీని తయారీకి తక్కువ ఖర్చు అయిందని పేర్కొన్నాయి. వైద్య, పశుసంవర్ధకం, వ్యవసాయ రంగాల్లో చేపట్టే పరిశోధనలకు ఈ మైక్రోస్కోప్‌ ఎంతో ఉప యోగపడుతుందని పేర్కొన్నాయి.

ఆఫ్‌–ది షెల్ఫ్‌ ఎలక్ట్రానిక్‌ చిప్‌లతో తయారు చేసిన ఈ పరికరం వ్యాధులను గుర్తించే పనిని విస్తృతం చేస్తుందని తెలిపాయి. దీన్ని డాక్టర్‌ శిశిర్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఐఐటీ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి ఆయనను అభినందించారు. సాంకేతికత ప్రయోజనాలను సమాజానికి అందిం చేందుకు హైదరాబాద్‌ ఐఐటీ కృతనిశ్చయంతో పని చేస్తోందని చెప్పారు. డాక్టర్‌ శిశిర్‌ కుమార్‌ నేతృత్వంలో పరిశోధకులు ఏక్తా ప్రజతి, ఎంటెక్‌ విద్యార్థి సౌరవ్‌ కుమార్‌ ఈ మైక్రోస్కోప్‌ను అభివృద్ధి చేశారని తెలిపారు. 

మరిన్ని వార్తలు