నేతన్నకు చేయూత: కేటీఆర్

5 Jan, 2021 01:57 IST|Sakshi

కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తాం: మంత్రి కేటీఆర్‌

కరోనా సమయంలో 25 వేల మందికి రూ.95 కోట్ల మేర లబ్ధి

జనగామ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్కు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సమయంలో నేత కార్మికులను ఆదుకున్న ‘నేతన్నకు చేయూత’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించే అంశాన్ని రాష్ట్ర మంత్రి వర్గం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ కార్య క్రమాన్ని తిరిగి కొనసాగిం చాలని నేత కార్మికుల నుంచి వినతులు అందు తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చేనేత, జౌళి విభాగం కార్యకలాపా లపై సోమవారం కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. నేతన్నకు చేయూత పథకం లబ్ధిదా రులు కాలపరిమితి ముగియక ముందే తాము పొదుపు చేసిన మొత్తంతో పాటు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్‌ని ఒకేసారి వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్నారు.

దీంతో కరోనా సమయంలో 25 వేల మంది చేనేత కార్మికులకు సుమారు రూ.95 కోట్లు అందాయన్నారు. నేత కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే, రాష్ట్రంలోని పవర్‌లూమ్‌ కార్మికులను ఆదుకునేందుకు బతుకమ్మ చీరల తయారీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో చేనేత, జౌళి రంగానికి కేటాయింపులపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

20 వేల నేత కుటుంబాలకు ప్రయోజనం
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వినతి మేరకు జనగామ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటవుతున్న ఈ పార్కు ద్వారా 20 వేల మంది నేత కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కొడకండ్ల ప్రాంతంలో నైపుణ్యం కలిగిన వేలాది మంది నేత కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని, మినీ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు ద్వారా వారికి స్థానికంగా ఉపాధి కల్పిస్తామన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రి దయాకర్‌రావుతో పాటు చేనేత, జౌళి విభాగం డైరక్టర్‌ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు