తెలంగాణ: వధువుకు ఎమర్జెన్సీ సర్జరీ.. ఆస్పత్రి బెడ్‌పైనే తాళి కట్టాడు

23 Feb, 2023 19:52 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: అమ్మాయిది నిరుపేద కుటుంబం. అందుకే పెళ్లి అయినా ఘనంగా చేయాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వివాహానికి ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోపు పెళ్లి కూతురు ఆస్పత్రి పాలైంది. ఆ పెళ్లి కొడుకు వధువు కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆసుపత్రి బెడ్‌పైనే వధువుకు తాళి కట్టాడు వరుడు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లంబాడిపల్లికి చెందిన శైలజకు.. భూపాలపల్లికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ముహూర్తం. అయితే.. బుధవారం రాత్రి వధువుకు కడపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఎమర్జెన్సీ ఆపరేషన్‌ చేశారు వైద్యులు. అయితే..

ఖర్చు చేసి చుట్టాలందరినీ పిలిపించి.. వివాహ వేడుకను వాయిదా వేయడానికి పెళ్లి కొడుక్కి మనస్సు రాలేదు. అందుకే.. పెద్దలను ఒప్పించాడు. ఆపై ఆస్పత్రి వైద్యులతో మాట్లాడితే.. వాళ్లూ సంతోషంగా అంగీకరించారు. వాళ్ల సమక్షంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఆ జంట.  

మరిన్ని వార్తలు