మునుగోడు ఉప ఎన్నిక: ఓటర్లకు సీఈవో వికాస్‌ రాజ్‌ కీలక సూచన

2 Nov, 2022 17:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ రేపు(గురువారం) ఉదయం జరగనుంది. ఈ క్రమంలో.. ఏర్పాట్ల పర్యవేక్షణపై సాక్షి టీవీతో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. 

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్‌ రాజ్ సాక్షికి వెల్లడించారు. ‘‘వెబ్ క్యాస్టింగ్ ద్వారా 298 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పరిశీలిస్తాం. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ఓటర్లకు చేతిపై ఎలాంటి పార్టీల గుర్తులు ఉండరాదు. పోలింగ్ కేంద్రాల్లో గుర్తులు ప్రదర్శించరాదు.

ఈ ఉప ఎన్నికకు సంబంధించి.. దాదాపుగా ఐదు వందల వరకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేయించాం. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తిరిగి రిసెప్షన్ లో ఇచ్చే వరకు  జాగ్రత్తగా ఉండాలి. ఈవీఎంలను వదిలి వెళ్లవద్దు. స్ట్రాంగ్‌ రూమ్ లో ఈవీఎంలను భద్రపరించేందుకు ఏర్పాట్లు చేశాం.  కౌంటింగ్ ప్రక్రియలో వెయ్యి మందికి పైగా ఏజెంట్లు ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలోకి కూడా అనుమతి ఉన్నవారినే పంపిస్తాం అని సీఈవో వికాజ్‌రాజ్‌ సాక్షితో అన్నారు. 

మునుగోడు ఉప ఎన్నిక- కీలక పాయింట్లు..

► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు  ఏర్పాటు చేశారు. 

► నవంబర్‌ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది.

► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు. ఐదు వేల మంది పోలీస్‌ సిబ్బందిని మోహరిస్తారు.

► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. 

► పోలింగ్‌ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 

► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి.

► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు.

► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు