జెండా, ఎజెండా కోసం సూచనలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనకు పునరుజ్జీవం పోసేందుకు సిద్ధమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న నూతన పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రజల ఆశయాలే పార్టీ సిద్ధాంతాలని చెప్పారు. కొత్త పార్టీ కోసం అన్ని జిల్లాల కార్యకర్తలతో బుధవారం ఆమె లోటస్పాండ్లో సన్నాహక సమావేశం నిర్వహించారు.
‘అన్ని వర్గాల బాగు కోసం స్థాపించబోయే మన పార్టీకి సంబంధించి జెండా, ఎజెండా రూపకల్పన చేస్తున్నాం. దీని కోసం ప్రజలంతా reach@realyssharmila.com అనే ఈమెయిల్ ఐడీకి గానీ, 8374167039 నంబర్కు వాట్సాప్ ద్వారా గానీ సూచనలు పంపాలని కోరుతున్నాం’ అని ఆమె చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలందరూ ఆమోదించేలా ఉండాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు.