హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

18 Dec, 2023 19:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆమె బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌ బాబు, సీతక్క, అధికారులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. 

ఇక, శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆమె బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈనెల 23 వరకు శీతాకాల విడిది చేస్తారు. అలాగే, ఈనెల 20వ తేదీన భూదాన్‌ పోచంపల్లిలో ఆమె పర్యటించనున్నారు.

అక్కడ చేనేత ప్రదర్శన తిలకిస్తారు. ఈ విడిది సమయంలో రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశమున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పోలీస్‌ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు, పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ దారి మళ్లించే చర్యలను అధికారులు చేపట్టారు. ఈనెల 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 

>
మరిన్ని వార్తలు