ప్రైవేటుకే ఉపాధి కల్పన.. ఉద్యోగాల నియామకాలకు జాబ్‌ మేళాలు

29 Jan, 2023 11:56 IST|Sakshi

పొరుగు సేవల కోసం ఏజెన్సీల ఎంపిక

కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితం

క్రమంగా తగ్గుతున్న నమోదు, పునరుద్ధరణ

నామమాత్రంగా ఉపాధి కల్పనా శాఖ

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఉపాధి కల్పనా శాఖ కార్పొరేట్, ప్రైవేటు రంగాలకు కల్పతరువుగా మారింది. ఆయా సంస్థల కోసం జాబ్‌ మేళాలను నిర్వహిస్తూ ఉద్యోగులను వెతికి పెడుతోంది. ఒకప్పుడు నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఈ శాఖ ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగాల భర్తీలో బిజీగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్హతలతో సహా పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నా.. వయోపరిమితి దాటిపోయే వరకు ఒక్క ఉద్యోగం కూడా కలి్పంచలేని పరిస్థితి నెలకొంది. కనీసం ప్రభుత్వ శాఖలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీలో ఏజెన్సీ ఎంప్యానల్‌మెంట్‌కే పరిమితమైంది. 
 
పొరుగు సేవల్లో అంతంతే.. 
ఉపాధి కల్పనా శాఖ ప్రైవేటుపై దృష్టి సారించింది. సాధారణంగా కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు వ్యాపార ఆర్థిక లావేదేవీలను బట్టి ఉద్యోగుల సంఖ్యను కుదించడం, పెంచడం చేస్తుంటాయి. కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడగానే తిరిగి నిపుణులైన ఉద్యోగుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనా శాఖ ఆయా సంస్థలకు ఉద్యోగులను వెతికిపెట్టే బాధ్యతను భుజానా ఎత్తుకుంది. జాబ్‌ మేళాలు నిర్వహిస్తూ చిరు ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగుల ఎంపిక కోసం సంధాన
కర్తగా వ్యవహరిస్తోంది. 

ప్రభుత్వ శాఖల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల కోసం కేవలం ఏజెన్సీల నమోదుకు పరిమితమైంది. కొత్త ఉద్యోగ భర్తీ లేక పొరుగుసేవల కింద నియామకాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఉపాధి కల్పన కేంద్రంలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల్లో అర్హులైన వారికి సమాచారం అందించి ఎంపిక చేయాలి. ఇందు కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఉపాధి కల్పనా శాఖ అధికారి  కో కనీ్వనర్‌గా వ్యవహరించాలి. పొరుగుసేవల ఉద్యోగాలు నియామకాలు సాగుతున్నా.. అవి ఉపాధి కల్పనా శాఖ ద్వారా ఎంపిక జరిగిన దాఖలాలు మాత్రం లేవు. ఫలితంగా ఏజెన్సీలు తమకు నచ్చిన వారిని ఎంపిక చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. 

అచేతనంగా.. 
రెండు దశాబ్దాల వరకు ఉపాధి కల్పనా శాఖ నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా వెలిగి ప్రస్తుతం అచేతనంగా తయారైంది. అప్పట్లో ఏ శాఖకు లేని ప్రతిష్ట ఈ శాఖ ఉండేది. సర్కారు కొలువులకు ఉపాధి కల్పన శాఖలో నమోదు తప్పనిసరిగా ఉండేది.  దీంతో నిరుద్యోగులు ఈ  ఆఫీస్‌కు క్యూ కట్టి నమోదు చేసుకున్నారు. అభ్యర్థులకు సీనియారిటీ ప్రకారం విద్యార్హతలను బట్టి ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం వర్తమానం అందేది.  ప్రభుత్వ నోటిఫికేషన్‌ విధానం అందుబాటులో రావడంతో  శాఖకు వన్నె తగ్గినట్లయింది. ప్రస్తుతం కేవలం అభ్యర్థుల పేర్లు నమోదు, పునరుద్ధరణ, ప్రైవేటు సేవలకు పరిమితమైంది. 
 
ఆశల్లోనే అభ్యర్థులు.. 
ఉపాధి కల్పనా శాఖపై అభ్యర్థుల్లో ఆశలు సన్నగిల్లలేదు. సర్కారు కొలువుపై ఆశతో నమోదు, పునరుద్ధరణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అభ్యర్థుల నమోదు కొంత మేరకు పెరిగింది. రాష్ట్రం మొత్తం మీద 2014 జూన్‌ నుంచి ఇప్పటి వరకు సుమారు 2,72,124 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆ శాఖ 
గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో పురుషులు 1,62,928 ఉండగా, మహిళా అభ్యర్థులు 1,09,196 ఉన్నారు. 

ఒక్క కాల్‌ లెటర్‌ రాలేదు  
ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఉపాధి కల్పనా శాఖలో విద్యార్హతతో పేరు నమోదు చేసుకున్నా.. ఒక్క కాల్‌ లేటర్‌ రాలేదు. కేవలం ప్రైవేటు ఉద్యోగాల జాబ్‌ మేళాలకే ఉపాధి కల్పనా శాఖ పరిమితమైంది. సర్కారు కొలువుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి 
– సీలం దీపిక, హైదరాబాద్‌  

అవుట్‌ సోర్సింగ్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి 
అవుట్‌సోర్సింగ్‌ లోనైనా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం 
కలి్పంచి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి.
– పి.ప్రవీణ్‌ కుమార్
చదవండి: సమ్మోహన తీరం.. సరికొత్తగా హుస్సేన్‌ సాగర్‌

మరిన్ని వార్తలు