Ramappa Temple: తుది అంకానికి వారసత్వ హోదా

30 May, 2021 08:47 IST|Sakshi

జూలై 15 నుంచి 30 మధ్యలో రామప్ప దేవాలయంపై  యునెస్కో హెరిటేజ్‌ కమిటీ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రమణీయమైన శిల్పకళతో అలరారే రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. కోవిడ్‌ విలయం కారణంగా నిలిచిపోయిన తుది కసరత్తును యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ సైంటిఫిక్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) తిరిగి ప్రారంభించింది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జూలై 15 నుంచి 30 మధ్య యునెస్కో హెరిటేజ్‌ కమిటీ భేటీ కాబోతోంది. ఇందులో సభ్యత్వం ఉన్న 18 దేశాల ప్రతినిధులు నివేదికను కూలంకషంగా పరిశీలించి ఓటు వేయనున్నారు. ఎక్కువ ఓట్లు వస్తే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేరుతుంది.

లేదంటే మళ్లీ నిరాశ తప్పదు. అయితే ఇప్పటివరకు జరిగిన కసరత్తులో పూర్తి సానుకూల వాతావరణమే ఏర్పడినందున, ఈ కమిటీ కూడా సాను కూల నిర్ణయమే తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం యునెస్కో నుంచి స్థానిక అధికారులకు సమాచారం అందింది. కమిటీ నుంచి సానుకూల నిర్ణయం వస్తే, తెలుగు రాష్ట్రాల్లో తొలి యునెస్కో గుర్తింపు పొందిన కట్టడంగా ఈ కాకతీయుల కళాసృష్టి రికార్డు సృష్టించనుంది.
చదవండి: Telangana: జూన్‌ 15నుంచి రైతుబంధు

మరిన్ని వార్తలు