డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు?

12 Nov, 2020 13:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్‌ మొదటివారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ యోచిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గురువారం సమావేశమైంది. ఆయా పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఎస్‌ఈసీ... దీపావళి పండుగ అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్‌తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పార్టీలతో భేటీ

మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి, ఎమ్మెల్సీ, గ్రేటర్‌ ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశానికకి ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

వార్డుల విభజనలో అవకతవకలు
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో జరిగినట్లు ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేసినట్లు సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. వార్డుల వారీగా ఈనెల 7న జారీచేసిన ఓటరు పట్టికలను పరిశీలిస్తే వార్డుల విభజన చట్టంలో పేర్కొన్న విధంగాలేదని ఆక్షేపించింది. ఈ సందర్భంగా గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. కొన్ని వార్డుల్లో ప్రజలకు నష్టం, మరికొన్ని వార్డుల్లో ప్రజలకు లాభం కలుగుతుందని తెలిపారు. చట్టం ప్రకారం వార్డు వారీగా సగటు ఓట్లు 49,360 కాగా.. 140 వార్డుల్లో ఉండాల్సిన ఓటర్ల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.  కేవలం పది వార్డుల్లో మాత్రమే చట్టం ప్రకారం ఓటర్లున్నారని సంఘం కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. చదవండి: ‘గ్రేటర్‌’ ఎన్నికలకు తొందరొద్దు

వార్డుల విభజనలో అసమతుల్యం కారణంగా ఆయా వార్డులకు బడ్జెట్‌ కేటాయింపుల్లో వ్యత్యాసాలు భారీగా ఉండి ఆయా ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు మైలార్‌దేవ్‌పల్లి(59)వార్డులో 79,290 మంది ఓటర్లుండగా.. రామచంద్రాపురం(112)లో 27,831 మంది ఓటర్లున్నారన్నారు. బాధ్యతారాహిత్యంగా వార్డుల విభజన చేపట్టడం వల్లే ఈ అక్రమాలు వెలుగుచూశాయన్నారు. వార్డుల విభజన సక్రమంగా చేసేందుకు 5 సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఏమి చేయలేక మళ్లీ అదే తప్పు చేస్తుందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరగాలని కోరారు. వార్డుల వారీగా ఓటర్ల విభజన సరిచేయాలని మున్సిపల్‌ కమిషనర్‌కు ఆదేశాలివ్వాలని ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు