గ్రామీణ ప్రాంతాల నీటిసరఫరాపై పర్యవేక్షణ ఉంచండి 

16 Dec, 2023 04:24 IST|Sakshi

అధికారులకు పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ మంత్రి సీతక్క ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని శాఖ ఇంజనీర్లను కోరారు. మేడారం జాతరపై త్వరలోనే వివిధ విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

మిషన్‌ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్‌ ఇంజనీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజనీర్లతో శుక్రవారం మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్లు, నదులు తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్‌ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి ఆ శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ మంత్రికి వివరించారు.  

>
మరిన్ని వార్తలు