BJP GHMC Corporators: టీఆర్‌ఎస్‌లోకి ‘గ్రేటర్‌’ బీజేపీ కార్పొరేటర్లు

1 Jul, 2022 04:33 IST|Sakshi
కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ కార్పొరేటర్లు 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ శుక్రవారం నుంచి ప్రారంభ మవుతుండగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌కు (జీహెచ్‌ ఎంసీ)కి చెందిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు,  గురువారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తాండూరు మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సింధూజ గౌడ్, కౌన్సిలర్‌ ఆసిఫ్‌ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.

జూలై 2, 3 తేదీల్లో బీజేపీ భేటీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు భానోత్‌ సుజాతా నాయక్‌ (హస్తినాపురం), పొడవు అర్చన ప్రకాశ్‌ (రాజేంద్రనగర్‌), డేరంగుల వెంకటేశ్‌ (జూబ్లీ హిల్స్‌), సునీతా ప్రకాశ్‌గౌడ్‌ (అడిక్‌మెట్‌) మంత్రి కేటీఆర్‌తో నందినగర్‌లోని నివాసంలో గురువారం భేటీ అయ్యారు. అనంతరం కార్పొరేటర్లకు గులాబీ కండువాలు కప్పి మంత్రి కేటీఆర్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, పైలట్‌ రోహిత్‌రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు, ఇద్దరు కో–ఆప్షన్‌ సభ్యులు భృంగి ఆనంద్‌ కుమార్‌ నేతృత్వంలో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు