దళితాభివృద్ధిలో దశ పథకాలు

28 Jun, 2021 04:47 IST|Sakshi

విద్య, ఉపాధి కోసం పది రకాల సంక్షేమ పథకాలు

ప్రతి కుటుంబానికీ సాయం అందేలా అమలు

ఏడున్నరేళ్లలో రూ.13,798.67 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఈ పథకాలతో లబ్ధి పొందిన వారి సంఖ్య 31.74 లక్షలపైనే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం  ప్రతిష్టాత్మకంగా పది రకాల పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో విద్య, ఉపాధికి  ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన సంక్షేమ పథకాలు దళిత సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు పేర్కొంది. దళితుల్లో అన్ని కేటగిరీల్లోని వారికి సంక్షేమ ఫలాలు అందేలా రూపొందించిన ఈ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో, రాష్ట్రేతర మేధావుల నుంచి ప్రశంసలు లభించాయి. దళితుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎస్సీ అభివృద్ధి శాఖ వివరించింది. 2014–15 వార్షిక సంవత్సరం నుంచి 2021–22 సంవత్సరం మే నెలాఖరు వరకు పది పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 13,798.67 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఈ పథకాల ద్వారా ఏకంగా 31,74,223 మంది లబ్ధి పొందినట్లు ఆ శాఖ ప్రాథమిక గణాంకాలను వెల్లడించింది. 

విద్యకు పెద్దపీట... 
రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అత్యధిక ప్రాధాన్యం విద్యకు దక్కింది. జనాభా సంఖ్యకు తగినట్లుగా సర్కారు గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో  సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 268 పాఠశాలలు, కళాశాలలున్నాయి. వాటిలో 3.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకుల విద్యాసంస్థల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2014–15 నుంచి ఇప్పటివరకు రూ. 4558.74 కోట్లు ఖర్చు చేసింది. ఇక ప్రీ–మెట్రిక్, పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాల కింద రూ. 3,216.94 కోట్లు, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ కోసం రూ. 1,714.96 కోట్లు వెచ్చించింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో భాగంగా రూ. 1,943.59 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 1,422.11 కోట్లు ఖర్చు పెట్టింది.  

చదవండి: (వారికి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి)

మరిన్ని వార్తలు