ఇంకా ఎన్ని రోజులు కావాలి.. రాజాసింగ్‌ కేసులో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఫైర్‌

21 Oct, 2022 07:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్‌ కేసులో కౌంటర్‌ దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపడింది. గడువిచ్చినా ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఇదే చివరి అవకాశమని, వచ్చే విచారణలోగా కౌంటర్‌ దాఖలు చేయకుంటే.. తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం తేల్చిచెప్పింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

 కాగా, సెప్టెంబర్‌ 25న రాజాసింగ్‌ను పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ రాజాసింగ్‌ భార్య ఉషాబాయ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది రామచందర్‌రావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక జీపీ ముజీబ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. దాదాపు 100 కేసుల్లో రాజాసింగ్‌ నిందితుడిగా ఉన్నారన్నారు. కౌంటర్‌ అఫిడవిట్‌ 1650 పేజీలు ఉందని, సంతకం కోసం పంపించామని చెప్పారు. మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 28వ తేదీ వరకు చివరి అవకాశం ఇస్తున్నామని చెబుతూ.. విచారణను వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు