మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘ఉద్యమిక’

9 Mar, 2022 02:30 IST|Sakshi
సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ప్రారంభోత్సవంలో మహిళా పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్‌.  పటాన్‌చెరులో మహిళాదినోత్సవ కార్యక్రమంలో ఓ చిన్నారితో కేటీఆర్‌ 

పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి సింగిల్‌ విండో విధానం

మహిళల ఇండస్ట్రియల్‌ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

దినదినాభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్, ఇతర నూతన రంగాల్లో ఉన్న అవకాశాలను మహిళా పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలి. సంప్రదాయ, చిన్నచిన్న ఉత్పత్తి రంగాలకే పరిమితం కాకుండా నూతన రంగాలపైనా దృష్టి సారించాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్‌ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారి.    – కేటీఆర్‌

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. సింగిల్‌ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభు త్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశా లను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి, పటాన్‌చెరులో మంగళవారం నిర్వహిం చిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో(ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌) ఇండస్ట్రియల్‌ పార్క్‌ను ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల పారిశ్రామికో త్పత్తిని సులభతరం చేసేందుకు కార్పస్‌ఫండ్‌ సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ ఫ్లో ఇండస్ట్రియల్‌ పార్కులో 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించిం దన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్‌ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. 

వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు...
కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో 66 శాతం హైదరాబాద్‌లోనే జరిగిందని, హైదరాబాద్‌ దేశానికి ఫార్మా క్యాపిటల్‌గా అవతరిస్తోందని అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేం దుకు ఏర్పాటు చేసిన ‘వీ హబ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌’ సేవలను వినియోగించుకోవాలని మహి ళా పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.4.90 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఇప్పుడు రూ.11.50 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 130 శాతం వృద్ధి సా«ధించిందని పేర్కొన్నారు.

ఆ అగ్ని ప్రమాదంతోనే ‘కల్యాణలక్ష్మి’కి శ్రీకారం
పటాన్‌చెరు టౌన్‌: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ‘కల్యాణలక్ష్మి’ పథకానికి పునాది ఓ అగ్ని ప్రమా దమని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. మంగళ వారం పటాన్‌చెరు పట్టణంలోని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఒకసారి పల్లెనిద్రలో భాగంగా మహబూ బాబాద్‌లోని ఓ తండాకు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి కేసీఆర్‌ వద్దకు వచ్చి తన కూతురు వివాహం కోసం దాచుకున్న డబ్బు, ఇల్లు అగ్ని ప్రమాదం లో కాలిపోయాయని తన బాధను చెప్పుకున్నా డని కేటీఆర్‌ వివరించారు.

ఆ తండ్రి వేదన, ఆ అగ్నిప్రమాదం బాధ నుంచి కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనే కల్యాణలక్ష్మి పథకమని వెల్లడించారు. రూ.9వేల కోట్లతో పథకాన్ని ప్రారంభించి ఇప్పటివరకు పది లక్షల మంది ఆడపిల్లలకు ఆర్థికసాయం అందజేసి సీఎం కేసీఆర్‌ ఓ మేనమామలా నిలిచారని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు