ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కామ్రేడ్లు... నేడు పూర్తిగా డీలా
సాయుధ పోరాట సమయంలో అధికారానికి దగ్గరగా వచ్చిన పార్టీ
1994లో 34 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీని గడగడలాడించిన వైనం
బొల్లోజు రవి: కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగాయి. ఆ పార్టీల నేతృత్వంలోని సాయుధ పోరాటంతో తెలంగాణలో ఊరూరా ఎర్రజెండా రెపరెపలాడింది. కమ్యూనిస్టుల ఉద్యమాలంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. వాళ్ల పాటలు ప్రజలను ఉర్రూత లూగించేవి. మార్క్సిస్ట్ సాహిత్యం లక్షలాది మంది యువతను వామపక్ష భావజాలం వైపు తీసుకెళ్లింది.
ఇక చట్టసభల్లోనూ కమ్యూనిస్టుల గళం బలంగా వినిపించేది. అలాంటి కమ్యూనిస్టు పార్టీల కోటలు ఇప్పుడు బీటలువారాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోగా, తాజాగా ఒంటరిగా బరిలో దిగేందుకు సీపీఎం సిద్ధం కాగా, సీపీఐ కూడా అదే దారిలో పయనిస్తుందనే చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య నుంచి జీరో స్థాయికి దిగజారి..
1952 ఎన్నికల నాటికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీకి ఎక్కువ సీట్లే వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి 1953లో ప్రకాశం పంతులు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కాగా, తెలంగాణ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో కలిపి హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. తెలంగాణలో భాగంగా 1952లో కాంగ్రెస్కు 38 సీట్లు రాగా, పీడీఎఫ్ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులకు 36 సీట్లు వచ్చాయి. ఇక 1957లోనూ గణనీయమైన సంఖ్యలోనే సీట్లు సాధించి ప్రతిపక్ష స్థానం పొందింది. ఆ తర్వాత 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ 177 సీట్లు సాధిస్తే, సీపీఐ (అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ) 51 సీట్లతో ప్రతిపక్ష స్థానం సంపాదించింది. ఇక ఆ తర్వాత సీపీఐలో చీలిక వచ్చి సీపీఐ, సీపీఎంలుగా విడిపోయాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు మూడు, నాలుగో స్థానానికి చేరుకున్నాయి.
అప్పుడు సీపీఐకి 10, సీపీఎంకు 9 స్థానాలు దక్కాయి. 1972 ఎన్నికల్లో సీపీఐకి 7, సీపీఎంకు ఒక స్థానం లభించింది. ఎనీ్టఆర్ అసెంబ్లీ రద్దు చేశాక 1985లో జరిగిన ఎన్నికల్లో చెరి 11 స్థానాలు దక్కించుకొని మళ్లీ తమ సత్తా చాటాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 8, సీపీఎంకు 7 స్థానాలు రావడం గమనార్హం. 1989లో మళ్లీ సీట్లు తగ్గాయి. అయితే 1994లో కమ్యూనిస్టు పార్టీలు మళ్లీ పూర్వవైభవం దిశగా ముందుకొచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ భారీ మెజారిటీ సీట్లు సాధించారు. కాంగ్రెస్ రెండో స్థానంలో 26 సీట్లు సాధించగా, సీపీఐ, సీపీఎంలు కలిపి కాంగ్రెస్ కంటే ఎక్కువగా 34 సీట్లు సాధించడం విశేషం.
విడివిడిగా సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు సాధించాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో సీపీఐకి 13, సీపీఎంకు 8 సీట్లు రావడం విశేషం. 1999లో జరిగిన ఎన్నికల్లో సీపీఎంకు రెండు స్థానాలే దక్కగా, సీపీఐకి ఒక్కటీ రాలేదు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాలు సాధించాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 6, సీపీఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇక సీపీఐ, సీపీఎంల పరిస్థితి దిగజారుతూ పోయింది. అంటే 20 ఏళ్లుగా ఆ రెండు పార్టీలు చతికిలపడి పోయాయి. 2018 ఎన్నికల్లో ఒక్క సీటూ రాని దుస్థితిలోకి వెళ్లిపోయాయి.
రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పుంజుకోని వైనం..
రాష్ట్రం ఏర్పాటయ్యాక తిరిగి కీలకమైన స్థానంలోకి రావాల్సిన సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు దారుణమైన పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. ఒక రకంగా తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర ప్రకారం చూస్తే ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సి ఉండేదని ఆ పార్టీల సానుభూతిపరులు చెబుతుంటారు.
ఎందుకీ దుస్థితి అంటే..
కమ్యూనిస్టు పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చిన కారణాలు అనేకమనే చెప్పాలి. కొత్త తరం కమ్యూనిస్టు భావజాలం వైపు రావడం లేదని, మారుతున్న కాల పరిస్థితులను బట్టి నాయకత్వం నిర్ణయాలు తీసుకోవడంలేదన్న విమర్శలూ ఉన్నాయి. నాడు నాయకుల త్యాగాలు కేడర్లో ఉత్సాహం నింపగా, నేటి నాయకుల తీరుపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.
కమ్యూనిస్టులు చెబుతున్న కారణాలు
రాజకీయ విశ్లేషకుల మాట...