హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణలో కొనసాగుతున్న వర్షప్రభావం

26 Apr, 2023 07:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరం సహా తెలంగాణలోని జిల్లాలను వరుణుడు ముంచేశాడు. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం ఉదయం కూడా పలు చోట్ల వాన పడుతోంది. ఒకవైపు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంట నష్టం జరగ్గా..  మరోవైపు హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. భారీ ఈదురుగాలులతో దంచికొట్టడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయ్యి రంగంలోకి దిగింది. అయినప్పటికీ ఇప్పటికీ పలు ప్రాంతాలు నీటిలోనే ఉండిపోయాయి. రామచంద్రాపురంలో అత్యధికంగా 6 సెం.మీ. వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, బేగంపేట, కూకట్‌పల్లి, గాజులరామారం తదితర ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది.  సికింద్రాబాద్‌, కాప్రా, మల్కాజ్‌గిరి ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

అకాల వర్షాలతో, వడగండ్ల వానతో తీవ్ర పంట నష్టం వాటిల్లుతోంది. మరో నాలుగు రోజులపాటు వర్షా ప్రభావ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగండ్ల వానలు పడొచ్చని చెబుతోంది. కాబట్టి, ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరుతోంది.

మరిన్ని వార్తలు