తెలంగాణ: ఇగం.. ఆగమాగం! ఈ వారంపాటు డేంజర్‌బెల్స్‌!!

8 Dec, 2022 07:53 IST|Sakshi

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత.. తీవ్రంగా వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం.. దీనికి తోడు తుపాన్‌ ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత వారం రోజులుగా వణికిస్తున్న చలి.. ఇవాళ(గురువారం) ఉదయం మరింత ప్రభావం చూపెట్టింది. 

వాతావరణ ప్రభావంతో.. మధ్యాహ్నం సమయంలోనూ ఎండ ప్రభావం కనిపించడం లేదు. సాయంత్రం 5 గంటల నుంచే చలి క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోంది.  రాజధానిలోనూ అదే పరిస్థితి. ఉదయం వేళలో ప్రధాన రహదారులను పొగమంచు కప్పేస్తోంది. 

మంగళ, బుధవారాలతో పోలిస్తే.. గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోయాయి. హైదరాబాదులో నమోదైన టెంపరేచర్ .. సాధారణ స్థాయికంటే తక్కువగా నమోదైంది. మరోవైపు మాండూస్‌ తుపాన్‌ ప్రభావంతో.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో హైదరాబాదులోనూ వానలు పడొచ్చని భావిస్తోంది.

ఇక ఉత్తర తెలంగాణలో చలి ప్రభావం అధికంగా ఉంటోంది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డిల్లో చలి తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా పేషెంట్లు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సీజనల్‌ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున్న అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వారం పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రతలు..
అదిలాబాదు జిల్లా నేరడి గోండలో  10.3. డిగ్రీలు,  కుమ్రంబీమ్  జిల్లా  సిర్పూర్ యులో 10.6 డిగ్రీలు, కెరిమెరిలో  10.7డిగ్రీలు, ఉట్నూర్ లో   10‌.8 డిగ్రీలు, బోరజ్ 11.1 డిగ్రీలు, కుమ్రంబీమ్ జిల్లా తిర్యాని  11.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా   జన్నారం11.2 డిగ్రీలు నమోదు అయ్యాయి. 

ఇదీ చదవండి: ముంచుకొస్తున్న మాండూస్‌.. ఏపీలో భారీ వర్షాలు!

మరిన్ని వార్తలు