సీఎం కేసీఆర్‌ ఎటువైపు

22 Dec, 2020 09:30 IST|Sakshi

రైతు పక్షమా.. బీజేపీ వైపో తేల్చుకోవాలి

మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీహెచ్‌

సాక్షి, వరంగల్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై దేశ వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ రైతుల పక్షమా, బీజేపీ వైపా తేల్చుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు సూచించారు. చట్టాలకు వ్యతిరేకంగా హన్మకొండలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న వీహెచ్‌ను జనగామ జిల్లా పెంబర్తి బైపాస్‌ వద్ద అడ్డుకున్నారు. అంతలోనే సమాచారం అందుకున్న కాంగ్రెస్‌ నాయకులు వస్తుండటంతో ఆయనను లింగాలఘణపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వీహెచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు.


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలపై భారత్‌ బంద్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నా, సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే మార్పు వచ్చిందన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేకశారు. హన్మకొండలో విద్యార్థులు చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తనను అరెస్టు చేయడమేమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతు పక్షపాతి అని, రైతులకు న్యాయం జరిగే వరకు ప్రాణాలర్పించైనా పోరాడుతామని అన్నారు. కాగా పోలీసు స్టేషనులో వీహెచ్‌ను కాంగ్రెస్‌ నాయకులు చెంచారపు శ్రీనివాస్‌ రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, లింగాజీ, ఎండీ అజీజ్‌, విజయ్‌మనోహార్‌, బిక్షపతి, భృగుమహర్షఙ, రాజిరెడ్డి తదితరులు కలవగా, అనంతరం ఆయనను సొంత పూచీకత్తుపై పోలీసులు పంపించారు.

మరిన్ని వార్తలు