రైడ్‌..

1 Aug, 2020 10:07 IST|Sakshi
ఏటూరునాగాంలో బైక్‌పై వెళ్తున్న మైనర్లు 

వారి విన్యాసాలకు జంకుతున్న జనం

ఏజెన్సీలో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు

బాధ్యతలు విస్మరిస్తున్న తల్లిదండ్రులు 

ఏటూరునాగారం: మైనర్లు రోడ్లపై బైక్‌ విన్యాసాలతో హల్‌చల్‌ చేస్తున్నారు. బండ్లను ఇష్టానుసారంగా నడుపుతూ ప్రమాదాలకు బాధ్యులుగా మిగులున్నారు. పదేళ్ల నుంచి 17 ఏళ్ల వయస్సులో ఉన్న చిన్నారులు అతివేగంగా, విన్యాసాలు చేస్తూ ద్విచక్రవాహనాలు నడుపుతూ బాటసారులను ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ వచ్చి తమను ద్విచక్రవాహనాలతో ఢీకొడతారోనని ఆందోళన చెందుతున్నారు. పిల్లలు బైక్‌లపై వస్తున్నారంటే పక్కకు జరిగి కాసేపు ఆగి వెళ్లాల్సిన దుస్థితి ఏజెన్సీ మండలాల్లో ఉంది. 

ఏజెన్సీ మండలాల్లో..
ఏజెన్సీలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం(కె), వాజేడు మండలాల పరిధి గ్రామాల్లో మైనర్లు బైక్‌ రైడ్‌ చేయడం సర్వత్రా ఆగ్రహం చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారే ద్విచక్రవాహనాల లైసెన్స్‌ అర్హులు. కానీ ఏజెన్సీలో ఈ నిబంధనలు ఏమీ పనికి రావడం లేదు. ఇక్కడ ఆర్‌టీఏ సిబ్బంది, ట్రాఫిక్‌ సిబ్బంది లేకపోడంతో చిన్నారుల ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. అయితే పోలీసులు రోడ్డు నిబంధనలు విషయాలను పరిశీలిస్తుంటారు. ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు, జరినామాలను విధిస్తున్నప్పటికీ ఈ చైల్డ్‌ డ్రైవ్‌ విషయంలో ఎలాంటి చర్యలు లేకపోవడంతో వారి ప్రవర్తన మితిమీరినట్లుగా కనిపిస్తోంది. 

ట్రిపుల్‌ రైడ్‌ 
అసలే చైల్డ్‌ డ్రైవ్‌ అందులో త్రీబుల్‌ డ్రైవ్‌ చేసుకుంటూ దర్జాగా రోడ్డుపై నుంచి వెళ్లడంతో పక్కన వాహనదారులు, బాటసారులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఎక్కడ ఆ బాలుడు వచ్చి ఢీకొడతాడోనని  ఆందోళన నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో కెమెరాలతో ఫొటోలు తిసి ఇంటికి జరిమానాలను పంపించే అవకాశం ఉంది. ఇక్కడ అలాంటి లేకపోవడం వల్ల విచ్చలవిడిగా చైల్డ్‌ డ్రైవ్, త్రిబుల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. దీనిని నివారించాలని ఏజెన్సీలోని ప్రజలు కోరుతున్నారు. 

బాధ్యతను విస్మరిస్తున్న తల్లిదండ్రులు 
చిన్నారులకు ద్విచక్ర వాహనాలను ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రలు బాధ్యతలను విస్మరించి వయస్సు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని చిన్నారులకు బైక్‌లు ఇచ్చి రోడ్లపైకి పంపడం సరికాదు. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకు బండ్లు ఇవ్వకపోవడమే మంచిదని పలువురు కోరుతున్నారు. 

కఠిన చర్యలు తప్పవు 
చిన్నారులు ద్విచక్రవాహనాలను రోడ్లపైకి తీసుకువస్తే చైల్డ్‌ డ్రైవ్‌ పేరుతో కేసులు నమోదు చేస్తాం. అలాగే వాహన యజమాని, తల్లిదండ్రులపై కేసులతో పాటు జరిమానాలు విధిస్తాం. బైక్‌లను సీజ్‌ చేస్తాం. ఇక నుంచి ప్రతి రోజు రోడ్లపై బాల బాలికలు వాహనాలను నడిపితే సీజ్‌ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.– శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సై ఏటూరునాగారం

మరిన్ని వార్తలు