నేడు వైఎస్సార్‌ సంస్మరణ సభ 

2 Sep, 2021 05:18 IST|Sakshi

12వ వర్ధంతి సభను హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ఆయన సతీమణి విజయమ్మ 

వైఎస్‌ సన్నిహిత నేతలు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, రిటైర్డ్‌ జడ్జీలు, జర్నలిస్టులకు ఆహ్వానం  

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంస్మరణసభ గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. వైఎస్‌ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు రావాలంటూ 300 మందికిపైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఇందులో వైఎస్‌కు సన్నిహితులుగా మెలిగిన పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, రిటైర్డ్‌ న్యాయమూర్తులు, జర్నలిస్టులు, సినీప్రముఖులు ఉన్నా రు. వీరిలో కొందరికి విజయమ్మ స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు.

ఆహ్వానితుల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ డి.శ్రీనివాస్, మాజీ ఎంపీలు కేవీపీ రామచందర్‌రావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లతోపాటు మంత్రి సబితాఇంద్రారెడ్డి, పలు పార్టీల సీనియర్‌ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి బ్రదర్స్, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్‌బాబు, ఎంఏ ఖాన్, సురేశ్‌షెట్కార్, డి.కె.అరుణ, జితేందర్‌రెడ్డి, అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులున్నారని నిర్వాహకులు వెల్లడించారు. వీరితోపాటు మాజీ ఐఏఎస్‌ అధికారులు రమాకాంత్‌రెడ్డి, బీపీ ఆచార్య, మోహన్‌కందా, సినీప్రముఖులు చిరంజీవి, నాగార్జున, కృష్ణ, దిల్‌రాజు, పలువురు రిటైర్డ్‌ జడ్జీలు, జర్నలిస్టులున్నారని తెలిపారు. ఆహ్వానితుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారని సమాచారం. ఈ సభ ఏర్పాట్లను మాజీ ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్‌ వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన భాస్కరశర్మ పర్యవేక్షిస్తున్నారు.    

మరిన్ని వార్తలు