నేరం నాది కాదు సార్‌..!

28 Jul, 2023 08:38 IST|Sakshi

విజయనగరం క్రైమ్‌: పెండింగ్‌లో ఉన్న పాత ఈ చలానాల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌ గురువారం చేపట్టగా ఒక మోటార్‌ సైకిల్‌పై 93 ఈ చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని ట్రాఫిక్‌ డీఎస్పీ డి.విశ్వనాథ్‌ తెలిపారు. ఆ వాహనదారు వేరే వ్యక్తి నుంచి వాహనం కొనుగోలు చేసే సమయంలో గతంలో పెండింగ్‌లో ఉన్న ఈచలానాల గురించి తనకు తెలియదని చెప్పడంతో వాహనాన్ని సీజ్‌ చేశామని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు పాత వాహనాలు కొనుగోలు చేసే సమంయలో రికార్డులను పరిశీలించుకోవడంతో పాటు, ఆ వాహనంపై పెండింగ్‌లో ఉన్న ఈ చలానాల గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. అలా తెలుసుకోకుంటే పెండింగ్‌లో ఉన్న ఈ చలానాలను చెల్లించాల్సిన బాధ్యత ప్రస్తుత యజమానిపైనే ఉంటుందన్నారు.

ఈ చలానాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల వాహనాలపై కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే సమయంలో పోలీసులు చేపట్టే తనిఖీల్లో ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో పెండింగ్‌ ఈ చలనాలను పరిశీలించి, చలానాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టడంతో 163 మంది వాహనదారులు పాత ఈ చలానాలను చెల్లించారని డీఎస్పీ వివరించారు. స్పెషల్‌ డ్రైవ్‌లో ట్రాఫిక్‌ ఎస్సైలు లోవరాజు, రాజు, త్రినాథరావు, ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు