రాయపర్తి: విద్యార్థులకు బోధనోపకరణాలతో పాఠాలను బోధిస్తేనే సులభతరంగా అర్ధం అవుతాయని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి మాలోతు సారయ్య అన్నారు.
మండల పరిధిలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం మేళాను శనివారం నిర్వహించారు. దీంతో పాటు స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సారయ్యతో పాటు డీసీఈబీ సెక్రటరీ గారె కృష్ణమూర్తి, నోడల్ ఆఫీసర్ పి.ఆనందం ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ బోధనోపకరణలతో ప్రాక్టికల్గా బోధించడం వల్ల విద్యార్థులకు పాఠ్యాంశం సులభతరంగా అర్ధం కావడంతో పాటు గుర్తుండి పోతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉపన్యాస, డ్రాయింగ్, మెమొరీ గేమ్స్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రంగయ్య, ఎస్ఎంసీ చైర్మన్ మాలోతు వసుంధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.