పరకాల ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శాలిని లింగం
పరకాల: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అవసరమైన సమయంలో వాటిని వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని పరకాల ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శాలిని లింగం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం నాగారం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం జయప్రద అధ్యక్షతన న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శాలిని లింగం మాట్లాడారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాల గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెచ్చుమీరుతున్నాయని, వాటిని అరికట్టేందుకు నేటి విద్యార్థి లోకం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేరుగు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాజు, టీఎల్ఎస్ఏ సభ్యులు వి.చంద్రమౌళి, పి.వెంకటరమణ, రాజమౌళి, పరమేశ్వర్, రాజయ్య పాల్గొన్నారు.