మొదలైన ఎన్నికల రగడ!

22 Nov, 2023 01:12 IST|Sakshi
ఆందోళన చేస్తున్న నాయకులు

పరకాల: పరకాల నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల రగడ ముందే మొదలయ్యింది. ఎన్నికల కమిషన్‌ కొత్తగా హోమ్‌ ఓటింగ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ముందుగా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు పరకాల నియోజకవర్గంలో ఉన్న 302 ఓట్లను ఏజెంట్ల సమక్షంలో మంగళవారం నుంచి ప్రారంభించారు. అయితే పరకాల మండలం నాగారంలో ఏజెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, వైస్‌ ఎంపీపీ చింతిరెడ్డి మదుసూధన్‌రెడ్డి సమక్షంలో హోం ఓటింగ్‌ నిర్వహించడం వివాదాస్పందంగా మారింది. హోమ్‌ ఓటింగ్‌ ద్వారా ఎంపికై న ఓట్లు నాగారంలో 14 ఉండగా.. 4 ఓట్లు కాంగ్రెస్‌, బీజేపీ ఏజెంట్లు లేకుండానే వేయించడం గొడవకు దారితీసింది. అధికారులు సైతం పక్షపాతం చూపిస్తూ.. కేవలం బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధి సమక్షంలో ఓటు వేయించడం వల్ల ఆఓటర్లపై ఒత్తిడి చూపించే అవకాశం ఉందని నాగారం సర్పంచ్‌ కట్కూరి స్రవంతి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ జయంత్‌లాల్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.

చేయిచేసుకున్న సీఐ

ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ నాయకులపై పరకాల సీఐ వెంకటరత్నం చేయిచేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, ఎన్నికల అధికారుల తీరుపై రెండు పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్‌ ఎంపీపీని అక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. దీంతో గొడవ సద్దుమణిగి అధికారులు ఓటింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. అసలే నాగారం గ్రామంలో మూడు పార్టీల మధ్య నువ్వా నేనా? అన్నట్లు పోటీ ఉండగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల అధికారులు చూపించిన అత్యుత్సాహం అసెంబ్లీ ఎన్నికలకు ముందే గొడవకు నాంది పలికినట్లు అయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హోంఓటింగ్‌లో పక్షపాతం చూపుతున్నారంటూ ఆందోళన

బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధి సమక్షంలో ఓటింగ్‌పై మండిపాటు

కాంగ్రెస్‌ నాయకుడిపై చేయిచేసుకున్న పరకాల సీఐ

గొడవతో వైస్‌ ఎంపీపీని కూడా

అనుమతించని అధికారులు

మరిన్ని వార్తలు