సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిజామాబాద్లో అధికారుల అడ్డగింత ఘటనలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. గురువారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి ఘటనలను సహించేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ‘ ఇటువంటి వ్యక్తులు కేవలం మూర్ఖులే కాదు! వారి వల్ల ఇతరులకు కూడా ప్రమాదమే’నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితుడు బుధవారం బాత్రూమ్లో జారిపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతడి చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లపై, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఐసోలేషన్ వార్డులోని కిటికి అద్దాలు ధ్వంసం చేశారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్ను చెల్లాచెదురు చేశారు.