నాన్నా.. నన్ను బతికించవూ..

15 May, 2017 07:33 IST|Sakshi
నాన్నా.. నన్ను బతికించవూ..

ఓ చిన్నారి ఆఖరి ఆర్తనాదం
క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూసిన చిన్నారి
వైద్యం చేయించడానికి అష్టకష్టాలు పడిన తల్లి
వైద్య ఖర్చుల కోసం ఇల్లు అమ్ముతుంటే అడ్డుకున్న తండ్రి
ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయుల దౌర్జన్యం
మాతృ దినోత్సవం రోజున విజయవాడలో ఓ తల్లికి కడుపుకోత


పిల్లలకు జ్వరమొస్తేనే తల్లడిల్లిపోతాం.. నిమిషానికోసారి చేయి పట్టుకుని చూస్తాం.. డాక్టర్, మందులు అంటూ హడావుడి చేస్తాం.. తిరిగి వారు కోలుకునే వరకు నిద్రపోకుండా సపర్యలు చేస్తాం.. అలాంటిది క్యాన్సర్‌తో బాధ పడుతున్న కన్న బిడ్డ ‘నాన్నా.. నన్ను బతికించు ప్లీజ్‌.. నేను స్కూల్‌కెళ్లి ఎన్ని నెలలైందో.. నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంది.. నీతో మాట్లాడాలని ఉంది..’ అంటూ కన్నీటితో వేడుకున్నా ఆ తండ్రి గుండె కరగలేదు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో తల్లీబిడ్డను వీధిన పడేశారు. చరమాంకంలో ఆ బిడ్డ తన తండ్రికి పంపిన వీడియోలోని ఒక్కో మాట వింటుంటే కళ్లెంట నీరు ఆగలేదు..

నేను ఎక్కువ రోజులు బతకనంట డాడీ..
‘‘డాడీ.. నీ దగ్గర డబ్బుల్లేవంటున్నావ్‌..
కనీసం నా ఇల్లుందిగా.. ఈ ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో అయినా నాకు ట్రీట్‌మెంట్‌ చేయించు డాడీ..
ట్రీట్‌మెంట్‌ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంట డాడీ.. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు డాడీ..
నన్ను బ్రతికించు డాడీ..
నేను స్కూల్‌కెళ్లి ఎన్ని మంత్స్‌ అయిందో
నీకు తెలుసు కదా డాడీ..
నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంది..
దయచేసి నాకు ట్రీట్‌మెంట్‌ చేయిస్తే హ్యాపీగా
నేను టెన్త్‌ క్లాస్‌ చదువుకుంటా.. స్కూలుకెళ్తా..
నా ప్రాణాలు కాపాడు డాడీ.. నీకు దండం పెడతా..
చేయి కూడా నొప్పిగా ఉంది డాడీ..
నీకు దండం పెడదామంటే
చేయి వాచిపోయి నొప్పిగా ఉంది డాడీ..
కాళ్లు కూడా వాచి పోయాయి డాడీ..
కుంటుతూ నడుస్తున్నా డాడీ..
ఎప్పుడూ నన్ను మీ అమ్మతో పోలుస్తావుగా డాడీ.. వెంకట సుబ్బమ్మ అంటావుగా.. మీ మమ్మీకే డిసీజ్‌ వచ్చిందనుకుని నాకు ట్రీట్‌మెంట్‌ చేయించు డాడీ.. నాకు ఇపుడు ట్రీట్‌మెంట్‌ అవసరం అంట డాడీ..
నాకు ట్రీట్‌మెంట్‌ లేకపోతే ఇంక బతకనంటా..
అమ్మ దగ్గర డబ్బుల్లేవు డాడీ.. నిజంగా అమ్మ దగ్గర డబ్బుల్లేవు.. ఒకవేళ నీ డబ్బులు ఏమైనా మా మమ్మి తింటుందనుకుంటే మాకెవ్వరికీ డబ్బులివ్వద్దు..
నువ్వే నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయిం చు డాడీ.. నాకు అవసరమైనప్పుడల్లా ఆ డబ్బులు నువ్వే ఆస్పత్రిలో కట్టు డాడీ.. మమ్మీకి కూడా ఇవ్వద్దు..
నాకేమన్నా అయితే మీ నలుగురే దానికి బాధ్యత వహిస్తారు డాడీ.. మాదంశెట్టి శివకుమార్‌ నువ్వు నా తండ్రిగా, నీ కొడుకులు మాదంశెట్టి శివరామకృష్ణ, మాదంశెట్టి సీతారాం కృష్ణ, నీ భార్య మాదంశెట్టి కృష్ణకుమారి.. మీరు నలుగురూ కలసి ఈ ఆస్తికి అడ్డు వస్తానని ఇన్‌డైరెక్టుగా నన్ను చంపేయాలనుకుంటున్నారు.. మీ చేతికి మట్టి అంటకుండా నా కొచ్చిన జబ్బుతోనే చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ..
దయచేసి ఈ వీడియో చూసిన టూ త్రీ డేస్‌లో నువ్వు రెస్పాండ్‌ అవ్వు డాడీ.. ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్‌ చేయి డాడీ.. నేనే మాట్లాడుతా.. కనీసం నాతో మాట్లాడటానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడు డాడీ..
కొంచెమన్నా నా మీద జాలి చూపించు డాడీ..
నేను కూడా నీ కూతురునే కదా డాడీ..
ప్రేమ కాకపోయినా కనీసం జాలి అయినా చూపించు డాడీ.. ట్రీట్‌మెంట్‌ చేయించు డాడీ.. ప్లీజ్‌ డాడీ..’



సాక్షి, అమరావతి బ్యూరో:
బిడ్డను బతికించుకోవాలన్న ఆ తల్లి వేదన అరణ్య రోదనే అయ్యింది. కుమార్తెకు వైద్యం చేయించేందుకు ఆమె పడిన ఆరాటం ఫలించలేదు. బిడ్డ వైద్యం కోసం ఇంటిని అమ్మనీయకుండా ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీ యులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి మాదంశెట్టి సాయిశ్రీ (13) ఆదివారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. బొండా ఉమా వర్గీయుల రౌడీయిజానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన రాజధాని విజ యవాడలో కలకలం రేపింది.

మాదంశెట్టి సుమశ్రీ తన కుమార్తె సాయిశ్రీతో కలసి విజయవాడ దుర్గానగర్‌లోని ఓ అపార్టుమెంటు ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. సుమశ్రీ భర్త మాదంశెట్టి శివకుమార్‌ ఆ ఫ్లాట్‌ను కుమార్తె సాయిశ్రీ పేరిట రాశారు. సంరక్షకుడిగా తన పేరే పెట్టుకున్నారు. అయితే కొంత కాలంగా సుమశ్రీ, శివకుమార్‌ మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో సాయిశ్రీ క్యాన్సర్‌ బారిన పడింది. ఖరీదైన వైద్యం చేయిస్తే తప్ప ఫలితం ఉండదని వైద్యులు చెప్పారు. దీంతో తాము ఉంటున్న ఇంటిని విక్రయించి కుమార్తెకు వైద్యం చేయించాలని తల్లి సుమశ్రీ భావించారు. ఆ ఇల్లు మైనర్‌ అయిన కుమార్తె పేరిట ఉండటంతో సంరక్షకుడిగా ఉన్న తండ్రి శివకుమార్‌ సమ్మతించాల్సి ఉంది. ఇందు కు ఆయన అంగీకరించలేదు సరికదా అందుబాటులో లేకుండాపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లీకూతుళ్లు తల్లడిల్లిపోయారు.

ఎమ్మెల్యే బొండా వర్గీయుల బెదిరింపులు
ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వర్గీయులు కొందరు ఇటీవల ఆ ఫ్లాట్‌కు వచ్చారు. ఎమ్మెల్యే బొండా ఉమా చెప్పారంటూ ఆ ఇల్లు ఖాళీ చేయాలన్నారు. శివకుమార్‌ ఆ ఇంటిని తమకు అమ్మేశారని బెదిరించారు. దీనిపై సుమశ్రీ తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఉంటున్న ఫ్లాట్‌ను అమ్మేయడం ఏమిటి? కుమార్తె అనారోగ్య సమస్యల్లో ఉండగా ఈ దౌర్జన్యమేమిటి? అని ప్రశ్నించారు. ఇదేమీ పట్టించుకోని బొండా ఉమా వర్గీయులు మరింతగా చెలరేగిపోయారు. కుమార్తె సాయిశ్రీని తీసుకుని వైద్యం కోసం సుమశ్రీ హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో ఆ ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. సామాన్లను బయట పడేసి ఫ్లాట్‌ను ఆక్రమించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన సుమశ్రీని ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.

దీంతో ఓ రోజు రాత్రంతా ఆమె ఇంటిబయటే పడిగాపులు కాశా రు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వారం రోజుల్లో ఫ్లాట్‌ ఖాళీ చేయాలని హెచ్చరించి ఎమ్మెల్యే బొండా వర్గీయులు వెళ్లిపోయారు. కుమార్తె వైద్య ఖర్చుల కోసం ఆ ఇంటిని విక్రయించాలన్న సుమశ్రీ ప్రయత్నాలు ఫలించలేదు. అసలు శివకుమార్‌ ఉద్దేశపూర్వకంగా అందుబాటులో లేకుండాపోయారు. ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైనా ఎమ్మెల్యే ఏమాత్రం స్పందించ లేదు. దీంతో అంతా ఒక్కటై ఉద్దేశ పూర్వకంగా సుమశ్రీ, సాయిశ్రీలను వేధించారని స్పష్టమైంది.

బొండా ఉమా బాధ్యత వహించాలి
‘నా బిడ్డ సాయిశ్రీ మృతికి మాదంశెట్టి శివకుమార్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బాధ్యత వహించాలి. నా బిడ్డ ప్రాణాల మీదకు వచ్చినా వైద్య ఖర్చుల కోసం మా ఇంటిని అమ్ముకోనివ్వలేదు. ఎమ్మెల్యే బొండా ఉమా అండతో ఓ రౌడీషీటర్‌ మమ్మల్ని బెదిరించారు. ఇంటిని అమ్మి బిడ్డ ప్రాణాలు కాపాడాలని నా భర్త మాదంశెట్టి శివకుమార్‌ను వేడుకున్నాను. ఇంటిని అమ్ముకోవడాన్ని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే బొండా ఉమాను పలుసార్లు ప్రాథేయపడ్డాను. వారు ఏమాత్రం కనికరించలేదు.

పైగా వైద్యం చేయించకపోతే సాయిశ్రీ చనిపోతుందని, అప్పుడు ఇంటిని దక్కించుకోవచ్చని శివకుమార్‌ పథకం వేశాడు. అందుకు రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ శేషగిరిరావు, అతని కుమారుడు సహకరించారు. నా భర్త శివకుమార్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు స్నేహితుడు కావడంతో అతనికి అండగా నిలిచి దౌర్జన్యం చేశారు. దీంతో నా కూతురుకు సరైన వైద్యం చేయించలేకపోయాను. అనారోగ్యంతో తీవ్ర వేదన అనుభవిస్తూ నా కూతురు ప్రాణాలు విడిచింది. దీనికి ఎమ్మెల్యే బొండా ఉమా బాధ్యత వహించాలి. ఆయనకూ పిల్లలు ఉన్నారు. ఓ తల్లిగా నా ఆవేదనను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు.’    
– సాయిశ్రీ తల్లి సుమశ్రీ

ప్రాణాలు విడిచిన  సాయిశ్రీ
రోజురోజుకు సాయిశ్రీ ఆరోగ్యం క్షీణిం చింది. డబ్బులు లేక సుమశ్రీ తన కుమార్తెను మెరుగైన వైద్యం కోసం మళ్లీ హైదరాబాద్‌ తీసుకువెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించి సాయిశ్రీ ఆదివారం మధ్యా హ్నం ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో  కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి బోరున విలపించింది. శివకుమార్‌కు సహకరించిన వారందరిని కఠినంగా శిక్షిస్తేనే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందని కన్నీటిపర్యంతమైంది. సాయి శ్రీ చివరిసారిగా తన తండ్రికి పంపిన వీడియోను మీడియాకు చూపించింది.

మరిన్ని వార్తలు