బడిలో మద్యమా.. సిగ్గు సిగ్గు

25 Oct, 2018 13:13 IST|Sakshi
ఖాళీ మద్యంబాటిళ్లను వేలాడదీసి నిరసన తెలుపుతున్న విద్యార్థులు

పాఠశాలలో మద్యం బాటిళ్లు

శుభ్రం చేసిన విద్యార్థులు

ఖాళీ బాటిళ్లను వేలాడదీసి నిరసన

ఆత్మకూరులో ఘటన   

పాఠశాల.. పవిత్ర దేవాలయం.. దసరా సెలవుల్లో మందుబాబులు మద్యం సేవించి, గుట్కాలు నమిలి, సిగరెట్లు తాగి అపవిత్రం చేశారు.. ఆ చెత్త ను విద్యార్థులు, ఉపాధ్యాయులు శుభ్రం చేసుకు న్నారు. ఖాళీ బాటిళ్లు బ్యానర్‌ కట్టి నిరసన తెలి పారు. ఈ ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది.

నెల్లూరు, ఆత్మకూరురూరల్‌: ఎంతో చరిత్ర ఉన్న ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మందుబాబుల ఆగడాలని డిమాండ్‌ చేస్తూ ఆ పాఠశాల విద్యార్థులు బుధవారం వినూత్నరీతిలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. దసరా సెలవులు ముగిసిన తర్వాత స్కూల్‌కి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఊహించని విధంగా చేదు అనుభవం ఎదురైంది. పలు తరగతి గదుల్లో ఖాళీ మద్యం బాటిళ్లు, వాటర్, గుట్కా, సిగిరెట్‌ ప్యాకెట్లు వారికి కనిపించాయి. రెండురోజులపాటు వారు శుభ్రం చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదని ఖాళీ బాటిళ్లు, ఇతర చెత్తను తాడుతో కట్టి పాఠశాల ముఖద్వారంలో కోర్టు హాలుగా పిలువబడే భవనం బయట బుధవారం వేలాడదీశారు.

అక్కడే విద్యార్థుల సంతకాలతో వినమృతతో కూడిన విన్నపం అంటూ బ్యానర్‌ కట్టారు. ‘మీబిడ్డల్లాంటి మేము చదువుతున్న బడి అనబడే మా గుడిలో ఇటువంటి దురాగతాలు చేయొద్దు’ అని రాశారు. తమకు పాఠశాలే గుడి అని దానిని పాడు చేయొద్దని కోరారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడు శేషాద్రివాసును సంప్రదించగా సెలవురోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా అసాంఘిక శక్తులు తమ పాఠశాలలోకి ప్రవేశించి అనేక దురాగతాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వాచ్‌మన్‌ను నియమించుకుని రక్షణ కల్పించినా కొందరు ఖాతరు చేయడంలేదన్నారు. పోలీసులు కూడా తమ పాఠశాల వైపు వచ్చే అవకాశం లేకపోవడంతో భద్రత గాలిలో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు